ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కేసీఆర్ అభినందనలు: ఎందుకంటే?
ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం ప్రత్యేకంగా అభినందించారు.
హైదరాబాద్: సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గంలోని ఇంటర్మీడియెట్ విద్యార్థులకు సొంత ఖర్చుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం ప్రత్యేకంగా అభినందించారు.
గురువారం ప్రగతిభవన్లో కోనప్ప సీఎంను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 'నియోజక వర్గం పరిధిలోని దాదాపు 2,200 మంది విద్యార్థులకు సొంత ఖర్చుతో భోజనంతో పాటు ఆయా విద్యార్థులకు రగ్గులు, పుస్తకాలు కూడా అందిస్తూ ఆదర్శంగా నిలిచారు' అని కోనప్పను అభినందించారు.
పెంచికలపేటలో బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.30కోట్లు, నియోజకవర్గంలో అంతర్గత రహదారుల కోసం రూ.4.10కోట్లు సీఎం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే కోనప్ప తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

భూ సేకరణ బిల్లుకు మండలి ఆమోదం
ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణం జరుగాలంటే, తెలంగాణ రైతుల బతుకులు బాగుపడాలంటే భూసేకరణ చట్టం-2013కు సవరణలు చేయక తప్పదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ అభివృద్ధి నిరోధకులను అడ్డుకోవటం కోసం, చట్ట సవరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారం ఉందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 ప్రకారం రాష్ట్రాలకు ఈ అధికారం లభించిందని మంత్రి శాసనమండలిలో చెప్పారు.
అసెంబ్లీ ఆమోదించిన భూసేకరణ బిల్లు -2016ను శాసనమండలిలో హరీశ్రావు గురువారం ప్రవేశపెట్టారు. బిల్లు ప్రాధాన్యతను మంత్రి వివరించారు. రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేయడానికే భూసేకరణ చట్టం-2013కు సవరణలు జరిపామని, గుజరాత్ సహా పలు రాష్ర్టాలు ఈ చట్టానికి ఇప్పటికే సవరణలు చేశాయని గుర్తు చేశారు. భూసేకరణ లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని విపక్షాలను ప్రశ్నించారు.
రోడ్లు, మౌలిక సదుపాయాలు, సాగు, తాగునీటి పథకాలు, రైల్వేలు, ఎయిర్పోర్టుల వంటి అభివృద్ధి కార్యకలాపాలన్నింటికీ భూసేకరణ ప్రధానమన్నారు. వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మెట్రోరైలు, సాగునీటి ప్రాజెక్టుల కోసం 2014 జనవరి నుంచి జరిగిన భూసేకరణ ప్రక్రియకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అప్పటి నుంచి అమలులోకి వచ్చే విధంగా బిల్లును రూపొందించామని మంత్రి తెలిపారు. ఇది అర్థంకాని రాజకీయ పక్షాలు ఆయోమయానికి గురవుతూ ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నాయని విమర్శించారు.
దేశాభివృద్ధికి 2013 భూసేకరణ చట్టం అడ్డంకిగా మారిందని ప్రధాని మోడీ , కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ పలు సందర్భాల్లో చెప్పారని హరీశ్రావు గుర్తు చేశారు. భూసేకరణ వ్యవహారం రాష్ట్రాల పరిధిలోనిదని అరుణ్జైట్లీ నీతిఆయోగ్ సమావేశంలో ప్రకటించారన్నారు.
ఇప్పటివరకూ సాగునీటి ప్రాజెక్టుల కోసం 60 వేల ఎకరాలు సేకరించగా, 123 జీవో కింద 47 వేల ఎకరాలను, భూసేకరణ చట్టం-2013 ప్రకారం 13వేల ఎకరాలను సేకరించినట్లు మంత్రి హరీశ్రావు వెల్లడించారు. మంత్రి వివరణ తర్వాత బిల్లును మండలి ఆమోదించింది.












Click it and Unblock the Notifications