కేసీఆర్ అనూహ్య నిర్ణయం - హరీష్ కు కీలక బాధ్యతలు..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. రేవంత్ ప్రభుత్వం లక్ష్యంగా కొత్త వ్యూహాలను అమలు చేసేందుకు సిద్దమయ్యారు. నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. రేవంత్ సైతం కేసీఆర్ పై ధీటుగా స్పందించారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హరీష్ కు బాధ్యతలు అప్పగించారు.
మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్లో అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ మరియు హైదరాబాద్ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ముఖ్య నేతలతో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్రావుతో పాటు ఆయా జిల్లాలకు చెందిన కీలక నేతలు పాల్గొననున్నారు.

ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కేసీఆర్ ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఈ అంశం పైన పార్టీ సమావేశంలో కీలక అంశాలను వెల్లడించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడుతోందని ఆరోపించారు.
ఈ అంశంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో నిర్వహించే భారీ బహిరంగ సభల తేదీలను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. నీటి వాటాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టేలా కార్యాచరణ రూపొందించనున్నారు.
ఈ అంశం పైన పార్టీ వాయిస్ వినిపించటంతో పాటుగా బహిరంగ సభల నిర్వహణ బాధ్యతలను కేటీఆర్, హరీష్ కు అప్పగించనున్నారు. అసెంబ్లీలోనూ ఇదే అంశం పై హరీష్ పార్టీ వాయిస్ వినిపించే బాధ్యత కేటాయించారు. కేసీఆర్ సైతం సభకు హాజరవుతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. చాలా రోజుల తరువాత ప్రజల్లోకి వచ్చేందుకు.. సభల్లో పాల్గొనేందుకు కేసీఆర్ నిర్ణయించిన వేళ ఈ సమావేశం కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications