టీడీపీ ఎమ్మెల్యేలకు, అరుణ సోదరుడికి టిక్కెట్: కేసీఆర్ ప్లాన్తో ఒత్తిడిలో విపక్షాలు
హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. 119 నియోజకవర్గాలకు గాను ఏకంగా అసెంబ్లీని రద్దు చేసిన రోజే 105 మందిని ప్రకటించారు. మిగతా 14 స్థానాల్లో ప్రెండ్లీ పార్టీ మజ్లిస్కు చెందినవి. మరో 7 స్థానాల గురించి కేసీఆర్ ముందే చెప్పారు.
ముందస్తు ఎన్నికలు: కేసీఆర్ ప్రకటించిన 105మంది అభ్యర్థులు వీరే
టీడీపీ నుంచి వచ్చిన 12 మందికి టిక్కెట్లు
ఇద్దరికి టిక్కెట్ ఇవ్వడం లేదని, అయిదుగురు స్థానాలపై చర్చించాల్సి ఉందని చెప్పారు. కేసీఆర్ వచ్చే ఎన్నికల్లోను గజ్వెల్ నుంచి పోటీ చేయనున్నారు. 2014లో టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత తెరాసలో చేరిన 12 మంది సిట్టింగ్లకు టిక్కెట్లు ఇచ్చారు. విద్యార్థి నాయకులు, ఎంపీగా ఉన్న బాల్క సుమన్ చెన్నూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. మరో విద్యార్థి నాయకులు పిడమర్తి రవి సత్తుపల్లి నుంచి పోటీ చేయనున్నారు.
డీకే అరుణ సోదరుడికి టిక్కెట్
ఆర్టీసీ మంత్రిగా ఉన్న మహేందర్ రెడ్డి కుటుంబంలో ఇద్దరికి టిక్కెట్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డీకే అరుణ సోదరుడు రామ్మోహన్ రెడ్డికి కూడా టిక్కెట్ ఇచ్చారు. ఆయన మక్తల్ నుంచి పోటీ చేయనున్నారు. టీడీపీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన, కేసీఆర్కు సవాల్ విసురుతున్న రేవంత్ రెడ్డి పైన ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి పోటీ చేయనున్నారు.
వివాదాస్పద నేతలకు టిక్కెట్
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, శంకర్ నాయక్లు వివాదాలు ఎదుర్కొన్నారు. కానీ వారికి టిక్కెట్లు ఇచ్చారు. బొడిగె శోభకు టిక్కెట్ పైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆమె పేరును ప్రకటించలేదు. అక్కడ చర్చించాల్సి ఉందని చెప్పారు. జాబితాలో కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన దానం నాగేందర్ పేరు కనిపించలేదు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. మేడ్చల్, మల్కాజ్గిరి, వరంగల్ ఈస్ట్, చొప్పదండి, వికారాబాద్ నియోజవకర్గాలకు ఆయా లోకల్ లీడర్లతో మాట్లాడిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.
ఒత్తిడిలో విపక్షాలు
కాగా, కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్ సహా విపక్షాలను ఇరుకున పెట్టారు. అసలు టిక్కెట్లు అంటేనే పెద్ద ప్రహసనం. టిక్కెట్లు ప్రకటించినా అసంతృప్తులు, బుజ్జగింపులు ఉంటాయి. కానీ కేసీఆర్ లోలోన అన్నీ సెట్ చేసుకొని, రద్దు రోజే అభ్యర్థులను ప్రకటించారు. ఇక వారు ఎన్నికల ప్రచారం చేసుకోవాల్సిందే. కానీ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వంటి పార్టీలు మాత్రం అభ్యర్థుల కోసం మల్లగుల్లాలు పడాల్సి ఉంది. అభ్యర్థులను ప్రకటించడం ద్వారా కేసీఆర్ విపక్షాలను ఆత్మరక్షణలోకి, ఒత్తిడిలోకి నెట్టేశారు. అభ్యర్థుల ప్రక్రియ వారు ప్రారంభించాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ మాత్రం 75 మందితో తమ జాబితా సిద్ధంగా ఉందని చెబుతోంది.