ఇందిరమ్మ ఇళ్లలో భారీ అవినీతి: కేసీఆర్, అందుకే ఓటేశారని డీకే
గత ప్రభుత్వాల హయాంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భారీగా అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
హైదరాబాద్: గత ప్రభుత్వాల హయాంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భారీగా అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. డబల్ బెడ్రూమ్ ఇళ్లపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన అవినీతి బయటపడాలనే ప్రభుత్వంలోకి రాగానే సీబీసీఐడీ విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.
2004నుంచి 2014 వరకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భారీగా అవినీతి జరిగిందన్నారు. అవినీతికి పాల్పడిన 225 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. 122 మంది అధికారులు, 113 మంది దళారులు, రాజకీయ నేతలు, ఒక జడ్పీటీసీ, 3 ఎంపీటీసీలు, 14 మంది సర్పంచ్లు, 3 సింగిల్ విండో చైర్మన్లు అవినీతికి పాల్పడినట్లు అప్పటి ప్రభుత్వమే తేల్చిందని అన్నారు.
1,94,519 మంది అనర్హులు ఇండ్లు పొందినట్లు తేలిందని తెలిపారు. ఇందులో 1 లక్షా 4 వేల మందికి 235.90 కోట్లు చెల్లించారని చెప్పారు. ఇక 512 మంది గృహ నిర్మాణ శాఖ అధికారులను ఏకంగా తమ ఉద్యోగాల నుంచి తొలగించారని, మరో 140 మందిని సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. 122 మందిపై ఆరోపణలు రుజువై శిక్షలు పడ్డాయని చెప్పారు. 2.86 కోట్లను రికవరీ చేశారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో కట్టని ఇళ్లకు కూడా డబ్బులు స్వాహా చేశారని ఆరోపించారు. ప్రజలకు కష్టం కలగకూడదన్న ఉద్దేశంతోనే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు కేసీఆర్ తెలిపారు. రాజకీయ అవినీతికి అవకాశం లేకుండా గృహ నిర్మాణ పథకం ఉండాలని సంకల్పించామని, అందుకే ఇంటిని నిర్మించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వమే తీసుకుందన్నారు.
గృహ నిర్మాణాలకు మొత్తంగా రూ.1766కోట్లు సమాకూర్చినట్లు చెప్పారు. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. గత ఆరు దశాబ్దాలుగా ఇళ్ల నిర్మాణానికి కేవలం రూ.11వేల కోట్లు ఖర్చు చేస్తే.. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రూ.17,660 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఒక్క లబ్ధిదారుడిని తప్పుగా ఎంపిక చేసినా అధికారులను వెంటనే సస్పెండ్ చేస్తామన్నారు. 2.60లక్షల ఇళ్లే కాదు, ఇంకా ఎక్కువే కడతామని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఆశలు వమ్ము చేస్తోంది: డీకే అరుణ
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం అనుకున్నంత వేగంగా జరగడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కంటే రెండు పడక గదుల ఇళ్లు బాగుంటాయనే ప్రజలు ఓట్లు వేసి టిఆర్ఎస్ను గెలిపించారన్నారు. టిఆర్ వస్తే తమ బతుకులు బాగుపడతాయన్న ఆశతోనే ప్రజలు వారికి ఓట్లేశారని... అయితే వారి ఆశలు ప్రభుత్వం వమ్ము చేస్తోందని ఆరోపించారు.
వేగం పెంచాలి: లక్ష్మణ్
ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పులను టిఆర్ఎస్ ప్రభుత్వం చేయొద్దని బిజెపి ఎమ్మెల్యే లక్ష్మణ్ సూచించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరారు. రెండు పడక గదుల ఇళ్ల కోసం 10లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే.. ఈ రెండేళ్లలో కేవలం 1200 ఇళ్లు మాత్రమే నిర్మించారని చెప్పారు. రానున్న రెండున్నరేళ్ల కాలంలో మిగతా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏంటో చెప్పాలని కోరారు.