కేసీఆర్..చరిత్ర మార్చకు; నల్గొండ ఫ్లోరైడ్ సమస్యపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర ట్వీట్
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు ప్రజా దీవెన సభలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో మండిపడ్డారు. మునుగోడు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ నుండి విముక్తుల్ని చేశామని చెప్పుకోవడం పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను అంతం చేసింది టీఆర్ఎస్: కేసీఆర్ వ్యాఖ్యలు
మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టిఆర్ఎస్ పార్టీ 20వ తేదీన ప్రజా దీవెన బహిరంగ సభను నిర్వహించింది. ఈ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అతి ముఖ్యమైన సమస్య గా ఉన్న ఫ్లోరైడ్ సమస్యపై స్థానిక మంత్రి జగదీష్ రెడ్డి తో పాటు, సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఒకప్పుడు నల్గొండ జిల్లా ఎడారిలా ఉండేదని, దానిని సస్యశ్యామలం చేశామని పేర్కొన్న సీఎం కేసీఆర్, ఫ్లోరైడ్ తో నల్గొండలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఫ్లోరైడ్ బారి నుండి తాము నల్గొండ ప్రజలను కాపాడాం అంటూ పేర్కొన్నారు. నల్గొండ ఫ్లోరైడ్ ను అంతం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ఫేక్ ప్రచారం అంటూ మండిపడిన కోమటిరెడ్డి .. ఫ్లోరైడ్ సమస్యపై రియాల్టీ ఇదేనంటూ ట్వీట్
ఇక దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అసలు వాస్తవం ఇదే నని తాను నల్గొండ ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం చేసిన పోరాటానికి సంబంధించిన ఫోటోలను అప్పట్లో బిబిసిలో ప్రచురితమైన ఓ వార్తాకథనాన్ని పోస్ట్ చేశారు. ఇక సీఎం కేసీఆర్ నల్గొండ ఫ్లోరైడ్ పై చేసిన వ్యాఖ్యల పై మండిపడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఫ్లోరైడ్ పోగొట్టింది టిఆర్ఎస్ అయితే మరి 2003లో ఎమ్మెల్యేగా 12 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసింది ఎవరు? అంటూ ప్రశ్నించారు.

2009లో మినిస్టర్ గా జిల్లా నుంచి ఫ్లోరైడ్ ని అంతం చేసింది ఎవరు?
కెసిఆర్ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఫ్లోరైడ్ బాటిల్స్ అసెంబ్లీకి తెచ్చింది ఎవరు? గవర్నర్ ముందు ఫ్లోరైడ్ నీటితో అన్నం వండి చూపించిందెవరు? ఆరు వందల కోట్లతో ఐదు వందల గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత రక్షిత మంచి నీరు అందించింది ఎవరు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 2009లో మినిస్టర్ గా జిల్లా నుంచి ఫ్లోరైడ్ ని అంతం చేసింది ఎవరు? అనేది సీఎం కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. ఇక నాడు తానూ చేసిన పోరాటానికి సంబంధించిన వాస్తావాలు ఇవిగో అంటూ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు.

చరిత్ర మార్చకు .. చరిత్ర మరవకు కేసీఆర్ .. కోమటిరెడ్డి ట్వీట్
చరిత్ర మార్చకు.. చరిత్ర మరువకు కెసిఆర్ అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర పోస్ట్ పెట్టారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన పోస్ట్ ద్వారా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించింది తన పోరాటమని తెలియజేసే ప్రయత్నం చేశారు. సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్పారని, కేసీఆర్ మాటల్లో వాస్తవం లేదని తన పోస్ట్ ద్వారా తెలియజేశారు.












Click it and Unblock the Notifications