కెసిఆర్ ఉదారత: జర్నలిస్ట్ కెఎల్ రెడ్డికి రూ.15 లక్షలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సీనియర్ పాత్రికేయుడు, రచయిత కంచర్ల లక్ష్మారెడ్డి (కేఎల్ రెడ్డి)కి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు సోమవారం క్యాంపు కార్యాలయంలో రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించారు. తెలంగాణ ఉద్యమంతోపాటు అనేక సామాజిక అంశాలపై రచనలు చేసిన కేఎల్ రెడ్డి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఆయన పరిస్థితిపై ఇటీవల ఒక పత్రికలో వచ్చిన వార్తను చూసి సీఎం కేసీఆర్ స్పందించారు. క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి, యోగక్షేమాలు విచారించారు. వైద్యఖర్చులు, ఇతర అవసరాల కోసం రూ.15 లక్షల సాయాన్ని చెక్కురూపంలో అందించారు.
సీఎం చూపించిన ఆదరణకు కేఎల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఏడు దశాబ్దాల పాటు పాత్రికేయ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ సహాయం అందిస్తున్నట్టు సీఎం చెప్పారు. 85 ఏండ్ల కేఎల్ రెడ్డి నల్లగొండ జిల్లా నరసాయపల్లెకు చెందినవారు. ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటూ పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు.
కెసిఆర్ తన పట్ల చూపిన ఆదరణకు కెఎల్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. కెసిఆర్ ఆయనకు చెక్కు ఇస్తున్న సమయంలో నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి కూడా పక్కనే ఉన్నారు.