హరీశ్ లేకుంటే పరువు దక్కేదా?: టిఆర్ఎస్ నేతలకు కేసీఆర్ క్లాస్!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇటీవల ముగిసిన వరంగల్ మున్సిపల్ ఎన్నికలపై ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో గెలవలేకపోవడానికి పార్టీ నేతలే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
సొంత అభ్యర్థులను ఓడించేందుకు ఖర్చు పెట్టించారని వారిపై మండిపడ్డారు. 58 డివిజన్లలో కనీసం 50కి పైగా గెలిచే అవకాశాలు ఉండగా, 44 చోట్లే విజయం సాధించడం ఏంటని ప్రశ్నించారు. ప్రతి డివిజన్ లో రెబల్స్ బరిలోకి దిగారని గుర్తు చేసిన ఆయన, వీరిని బుజ్జగించడంలో ఘోరంగా విఫలమయ్యారని అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మంత్రి హరీశ్ రావు లేకుంటే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇంకా ఘోరంగా ఉండేవని అన్నారు. హరీశ్ బాధ్యతలు తీసుకోబట్టే పరువు దక్కిందని కెసిఆర్ అన్నట్లు తెలిసింది.
ఓ నేతను కాదని వేరే వారికి టికెట్ ఇచ్చినంత మాత్రాన, పార్టీ నిలిపిన వారు ఓడిపోవాలని కోరుకుంటారా? అని మండిపడ్డారు. ఈ పరిస్థితి పార్టీకి ప్రమాదకరమని, ఇలా జరిగితే కఠిన చర్యలు ఉంటాయని కేసీఆర్ హెచ్చరించినట్టు తెలిసింది.
బీజేపీతో జతకట్టం: టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్రంలోని బీజేపీతో జతకట్టి, మంత్రివర్గంలో చేరనుందని వస్తున్న వార్తలను లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నాయకుడు, మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి ఖండించారు. ఇదంతా ఊహాగానమేనని వెల్లడించిన ఆయన.. తాము కేంద్రంలో చేరబోమని, మంత్రి పదవుల కన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపైనే తమ దృష్టి ఉందని వివరించారు.
పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దుష్టశక్తులు కొన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఖమ్మంలో 27 నుంచి జరగనున్న టిఆర్ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ పేదల సంక్షేమమే ధ్యేయంగా సాగిందని అభిప్రాయపడ్డారు.