ఎన్టీఆర్కు నేనే ఇచ్చా: సిద్దిపేటపై కేసీఆర్, బాల్యస్నేహితుల్ని కారులో ఎక్కించుకున్న సీఎం
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్ కమిషరేట్ నిర్మాణాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు.
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్ కమిషరేట్ నిర్మాణాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు.
సీఎం కేసీఆర్ భవనాల నమూనాలను పరిశీలించిన అనంతరం శిలాఫలకాలను ఆవిష్కరించారు. అలాగే, సిద్దిపేట మండలం ఎన్సాన్ పల్లిలో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు, ఎంపీలు వినోద్, కొత్త ప్రభాకర్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రామలింగారెడ్డితోపాటు ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.
నాకు జన్మను ఇచ్చింది, రాజకీయ జన్మను ఇచ్చింది సిద్దిపేట అన్నారు. ఎక్కడపడితే అక్కడ అనర్గళంగా మాట్లాడే శక్తి, పోరాడే శక్తి, పదవులు ఇచ్చింది, తెలంగాణ సాధించగలిగే ఆత్మశక్తిని ఇచ్చింది... అన్నీ సిద్దిపేటనే అన్నారు. ఈ సిద్దిపేటకు శిరస్సు వంచి కృతజ్ఞతలు చెబుతున్నానని చెప్పారు.
1982లో తొలిసారి తాను శాసన సభకు పోటీ చేసి, ఓటమిపాలయ్యానని, అప్పుడు టిడిపిలో పనిచేశానని, ఆ సమయంలో స్వర్గీయ ఎన్టీఆర్ సిద్దిపేట నుంచి వెళ్తున్నారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో హరీష్ రావు స్కూల్లో చదువుతున్నాడన్నారు.
ఆ రోజు కొందరు సిద్దిపేట జిల్లాను గీయించి, తన చేతుల మీదుగా అటు నుంచి వెళ్తున్న ఎన్టీఆర్కు సిద్దిపేట చౌరస్తాలో ఆ పేపర్ ఇచ్చి, తమకు సిద్దిపేట జిల్లా కావాలని అడిగారని కేసీఆర్ చెప్పారు. స్వయంగా ఎన్టీఆర్కు తానే సిద్దిపేట జిల్లా కావాలని చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఎందుకో గానీ ఆయన కూడా చేయలేకపోయారని, అదే ఎన్టీఆర్ మంచిర్యాలను జిల్లా చేస్తానని ప్రకటించారని, కానీ చేయలేదన్నారు.
Recommended Video
ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా చాలా చెప్పారని, కానీ హామీను నెరవేర్చలేదన్నారు. పశ్చిమ బెంగాల్, ఏపీ తర్వాత అన్ని రాష్ట్రాలు జిల్లాలను పెంచుకున్నాయన్నారు. మనం కూడా పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. కేసీఆర్, బతికుండగానే అనుకున్నది సాధించావు, నీ జన్మ ధన్యమైందని చెప్పారని కేసీఆర్ చెప్పారు. ఈ మట్టిలో ఏముందో కానీ ఇక్కడి నుంచి (సిద్దిపేట) వెళ్లిన అందరూ తెలంగాణ సేవలో ఉన్నారన్నారు.
సొంత ఆదాయవనరులు సమకూర్చుకునే దిశలో భారత్లోనే తెలంగాణ నెంబర్ వన్ అని కేసీఆర్ చెప్పారు. భారత దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులను సంఘటితపరిచే ప్రయత్నాలు తమ ప్రభుత్వం చేస్తోందన్నారు. చేర్యాలను మున్సిపాల్టీగా మార్చే ప్రయత్నాలు చేస్తామన్నారు.
అంతకుముందు, సిద్దిపేట పర్యటనకు వచ్చిన కేసీఆర్ ములుగు వద్ద జాతీయ రహదారిపై కాసేపు తన కాన్వాయ్ని ఆపమన్నారు. అక్కడ తన చిన్ననాటి స్నేహితులు జహంగీర్, అంజిరెడ్డిలను పలకరించి, సిద్దిపేట పర్యటనకు తనతో పాటు వారిని వాహనంలో తీసుకెళ్లారు. దీంతో అక్కడి వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వాహనం దిగి తన చిన్ననాటి స్నేహితులను పలకరించడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేశారు.