పెద్దవారికి జాగ్రత్తలు చెప్పిన తెలంగాణ సీఎం కెసిఆర్
హైదరాబాద్: రేపు (బుధవారం) దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పెద్దలకు చిన్నపిల్లల పట్ల జాగ్రత్తలు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే దీపావళి పండుగ తెలంగాణ ప్రజల జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
ప్రజలు శాంతియుతంగా, పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుని టపాకాయలు కాల్చుతూ పండుగను జరుపుకోవాలని సూచించారు. గవర్నర్ నరసింహన్ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రెండు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఇవాళ ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీపావళి పండుగ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి గెలిచిన ఈ పర్వదినాన్ని ప్రజలు భక్తిభావంతో ఘనంగా జరుపుకోవాలన్నారు.
దుమ్ముగూడెం ప్రాజెక్టుపై కెసిఆర్ సమీక్ష
దుమ్ముగూడెం ప్రాజెక్టు పైన సిఎం కెసిఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. సమైక్య రాష్ట్రంలో దుమ్ముగూడెం ప్రాజెక్టును రాజీవ్, ఇందిర సాగర్లుగా విడగొట్టారన్నారు.
గోదావరి నుంచి నీళ్లు ఎత్తిపోసేలా దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. దుమ్ముగూడెం నుంచి కిన్నెరసాని వరకు లిఫ్టుల ద్వారా నీటిని తరలిస్తామన్నారు. జగన్నాథపురం, రోడ్లపాడు వద్ద రిజర్వాయర్లు నిర్మించి సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లందు, పాల్వంచ, వైరా, ఖమ్మం నియోజకవర్గాలకు నీరు అందిస్తామన్నారు.