నిరుపేదల మెతుకులను గుంజుకున్న మూర్ఖుడు కేసీఆర్.!రాహుల్ ప్రసంగం ప్రగతి భవన్ స్క్రిప్టన్న బండి సంజయ్.!
జడ్చర్ల/హైదరాబాద్ : కాంగ్రెస్-టీఆర్ఎస్ పొత్తు ఎన్నడో ఖాయమైందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 31 అసెంబ్లీ, 4 ఎంపీ సీట్లు ఇచ్చేలా సీఎం చంద్రశేఖర్ రావు ఒప్పందం చేసుకున్నారని బీజేపి తెలంగాణ అద్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ పర్యటన సందర్బంగా చేసిన ప్రసంగం మొత్తం ప్రగతి భవన్ నుండి పంపిన స్క్రిప్టులు మాత్రమేనని ఘాటు ఆరోపణలు చేసారు. ధరణి పేరుతో నిరుపేదల భూములను గుంజుకుంటున్న దుర్మార్గులు టీఆర్ఎస్ నేతలని, చంద్రశేఖర్ రావు కేబినెట్ లో వెంచర్ల శాఖను ఏర్పాటు చేస్తారేమో అనే సందేహాలు కలుతున్నాయన్నారు సంజయ్.

కేసీఆర్ కేబినెట్ లో వెంచర్ల కబ్జా శాఖ..
కేంద్రం ఉచితంగా ఇస్తున్న 5 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయకుండా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పేదల నోటికాడ ముద్దను లాక్కుంటున్నారని బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఈ విషయంపై టీఆర్ఎస్ నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేనికోసం తెలంగాణ పర్యటనకు వచ్చారో ఆయనకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్- టీఆర్ఎస్ కలిసి పోటీ చేయడం ఖాయమైందని, కాంగ్రెస్ కు ఎన్ని అసెంబ్లీ సీట్లు ఇవ్వాలో, ఎన్ని ఎంపీ సీట్లు కేటాయించాలో కూడా నిర్ణయం జరిగిపోయిందని పేర్కొన్నారు.

టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు ఖరారు..
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వద్ద డబ్బు సంచులు తీసుకున్న ఎన్నికల వ్యూహకర్త కాంగ్రెస్ తో చర్చలు జరిపారని అన్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని భావించిన రాహుల్ గాంధీ టీఆర్ఎస్ తో పొత్తు లేదంటూ ఆగమేఘాల మీద వివరణ ఇచ్చారన్నారు సంజయ్. రాహుల్ ప్రగతి భవన్ నుండి వచ్చిన స్క్రిప్టును చదువారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడ భూములు కన్పించినా టీఆర్ఎస్ నేతలు వదలడం లేదని, చివరకు నిరుపేదల భూములను కూడా గుంజుకుంటున్నారని మండిపడ్డారు. దేవాలయ భూములను కూడా వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు బండి సంజయ్.

జడ్చర్లలో ఆలయ భూములు స్వాహా..
జడ్చర్లలో 1500 కోట్ల రూపాయల విలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను కబ్జా చేసిన దుర్మార్గులు టీఆర్ఎస్ నేతలని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నేతల కబ్జాలను చూస్తుంటే, చంద్రశేఖర్ రావు తన కేబినెట్ లో వెంచర్ల కబ్జా మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారేమోనని ఎద్దేవా చేశారు. దళిత బిడ్డ నాగరాజును నడిరోడ్డుపై హత్య చేసిన దుర్మార్గుల విషయంపై చంద్రశేఖర్ రావు నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 24వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కుమార్ కు జడ్చర్ల ప్రజలు బ్రహ్మరథం పట్టినట్టు పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

ఖాళీ స్థలాలు కనిపిస్తే కబ్జా..
జడ్చర్లలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాద యాత్రకు వేలాది మంది జనం తరలివచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పూల వర్షం కురిపించారు. డప్పు చప్పుళ్లు, డ్యాన్సులతో బండి సంజయ్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్ వద్ద హాజరైన అశేష జన సందోహాన్ని ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు. జడ్చర్లలోని 600 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 120 ఎకరాలను కబ్జా చేసిన ఘనులు టీఆర్ఎస్ నేతలు. టీఆర్ఎస్ నేతలు కన్పించిన ప్రతి ఖాళీ స్థలాలను కబ్జా చేస్తూ జనాన్ని దోచుకుంటున్నరని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications