కేటీఆర్కు లేఖ రాసిన రామోజీ రావు..!!
KCR health updates: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కోలుకుంటోన్నారు. ఇంట్లో జారిపడటం వల్ల ఆయన తుంటి ఎముక చిట్లింది. దీనికి శస్త్ర చికిత్స అవసరమైంది. యశోద ఆసుపత్రి డాక్టర్లు ఆయనకు చికిత్స నిర్వహించారు.
ఈ సర్జరీ విజయవంతమైంది. ఆసుపత్రిలో వాకర్ సహాయంతో నడవగలుగుతున్నారు. పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని డాక్టర్లు వెల్లడించారు. తండ్రి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన నేపథ్యంలో- కేటీఆర్ నేడు శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. మరో రోజున స్పీకర్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు.

కేసీఆర్ ఆరోగ్యం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు నాయకులు కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. వేగంగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. భారత్ రాష్ట్ర సమితి నాయకులు చాలాచోట్ల ప్రత్యేక పూజలూ చేస్తోన్నారు.
కేసీఆర్ గాయపడటం పట్ల తాజాగా మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు.. ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్కు కొద్దిసేపటి కిందటే లేఖ రాశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
కేసీఆర్ ప్రమాదవశాత్తూ జారిపడి గాయపడ్డారని తెలిసి బాధ పడ్డానని, దీన్ని పంచుకోకుండా ఉండలేకపోతున్నానని రామోజీ రావు అన్నారు. తుంటి మార్పిడి కోసం జరిగిన శస్త్ర చికిత్స విజయవంతం అయిందని తెలిసి సంతోషిస్తోన్నానని రామోజీ రావు చెప్పారు.
వ్యక్తిగత, రాజకీయ జీవితంలో ఎదురైన ఎన్నో ఆటుపోట్లను కేసీఆర్ ధైర్యంగా ఎదుర్కొన్నారని, ఈ సవాలును కూడా అవలీలగా అధిగమిస్తారని అన్నారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అనివార్యమే అయినప్పటికీ.. ఆ తరువాత వెంటనే కోలుకొని ప్రజాసేవకు కేసీఆర్ రెట్టించిన ఉత్సాహంతో పునరంకితమౌతారని తాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నానని రామోజీ రావు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications