విందుకు రండి: టిడిపి ఎమ్మెల్యేలకు కెసిఆర్
హైదరాబాద్: ఆపరేషన్ ఆకర్ష్ అమలుకు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధినేత కె చంద్రశేఖర రావు స్వయంగా రంగంలోకి దిగారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలకు ఆయనే స్వయంగా ఫోన్లు చేసి భోజనానికి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. నగర ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరికి సోమవారం ఆయన ఫోన్ చేసి రాత్రి భోజనానికి ఆహ్వానించారని మీడియాలో కథనాలు వచ్చాయి.
పార్టీలో చేరాలని ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతోనే విందుకు ఆహ్వానిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కొంతకాలంగా వివిధ స్థాయుల్లోని నేతల ద్వారా టీడీపీ ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ నాయకత్వం ఒత్తిడి తెస్తున్నా ఇంతవరకూ ఆ పార్టీకి ఫలితం దక్కలేదు. సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ మాత్రం కేసీఆర్ను రెండు మూడుసార్లు కలిసి ఆయనకు సన్నిహితంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినా ఆ పార్టీలో మాత్రం చేరలేదు.
ఈ స్థితిలో ఇప్పుడు కెసిఆర్ తానే ఎమ్మెల్యేలతో మాట్లాడటం మొదలు పెట్టారు. నేరుగా పార్టీలోకి రావాలని అనకుండా భోజనానికి రమ్మంటున్నారు. తన వద్దకు వచ్చి కూర్చుంటే ఎలాగైనా ఒప్పించగలనన్న ధీమాతో ఆయన ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వాళ్ళు పార్టీ మారినా మారకపోయినా వచ్చి కేసీఆర్తో కూర్చుని భోజనం చేస్తే వాళ్ళ పార్టీలో విశ్వాసం కోల్పోతారని, ఆ తర్వాత తమ దగ్గరకు రావడం తప్ప మరో మార్గం ఉండదని టీఆర్ఎస్ నేత ఒకరు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.
హైదరాబాద్ నగరంలోని టీడీపీ ఎమ్మెల్యేలందరితో మాట్లాడి వారిని తీసుకువచ్చే బాధ్యతను కెసిఆర్ తన తనయుడు కేటీఆర్, అల్లుడు హరీష్రావులకు అప్పగించినట్లు సమాచారం. వారిని కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించాలని, త్వరలో జరిగే పార్టీ ప్లీనరీకి వారిని తీసుకురావాలని ఆదేశించినట్లు చెబుతున్నారు.