ఎన్టీఆర్తో పోలిక.. కేసీఆర్ దమ్మున్న నాయకుడు: పరుచూరి
తాను పుట్టిన గడ్డకు న్యాయం చేసేందుకు కేసీఆర్ పోరాడుతున్నారని, ఎన్టీఆర్ పేదలకు ఒక గదిని నిర్మించి ఇస్తే.. కేసీఆర్ రెండు పడకగదుల ఇళ్లను నిర్మిస్తున్నారని పరుచూరి అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్పై తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఓ పుస్తకావిష్కరణలో పాల్గొన్న ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశంసించారు. కేసీఆర్ దమ్మున్న నాయకుడని కితాబిచ్చారు.
తాను పుట్టిన గడ్డకు న్యాయం చేసేందుకు కేసీఆర్ పోరాడుతున్నారని, ఎన్టీఆర్ పేదలకు ఒక గదిని నిర్మించి ఇస్తే.. కేసీఆర్ రెండు పడకగదుల ఇళ్లను నిర్మిస్తున్నారని పరుచూరి అన్నారు. రైతుల పొలాల్లోకి సాగునీరును పరుగులు పెట్టిస్తుండటం తనకు ఆనందం కలిగిస్తోందన్నారు.
సోమవారం నాడు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఛాంబర్లో నాగబాల సురేశ్కుమార్ రచించిన తెలంగాణ కోటలు గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమంలో పరుచూరి పాల్గొన్నారు. రచయిత తన గ్రంథాన్ని సీఎం కేసీఆర్కు అంకితమివ్వడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
ఏ ప్రాంతంలో అయితే భాష, సంస్కృతి, నాగరికత బయటకు వస్తాయో.. ఆ జాతి చాలా గొప్ప స్థానానికి చేరుకుంటుందని పరుచూరి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ.. ఈ గ్రంథం తీసుకురావడం ద్వారా 25 కోటల గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడిందన్నారు.
ఏ సమాజానికైనా చరిత్ర చాలా గొప్పదని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని రమణాచారి అన్నారు. ఎన్టీఆర్ హయాంలో జరిగిన కృషితోనే కుతుబ్షాహీ టూంబ్స్ ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు.