చంద్రబాబు కంటే ఎక్కువ కష్టపడుతున్న కెసిఆర్, మేమే కన్పిస్తున్నామా: హరీష్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన తెలంగాణ టీడీపీ నేతలు విమర్శలు గుప్పించడం విడ్డూరమని మంత్రి హరీష్ రావు శనివారం నాడు మండిపడ్డారు. కేసీఆర్ చైనా పర్యటనపై మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు.
అందరికీ కేసీఆర్ పర్యటనే కనపడుతోందా? ఏపీ సీఎం చంద్రబాబు చేసిన పర్యటనలు కనపడడం లేదా? అని నిలదీశారు. చంద్రబాబుతో పోల్చుకుంటే కేసీఆర్ చాలా కష్టపడుతున్నారన్నారు.
తెలంగాణకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువస్తున్నారని కితాబిచ్చారు. తెలంగాణకు పెట్టుబడులు తెచ్చి మరింత ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని హరీష్ రావు చెప్పారు.
పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక సర్క్యూట్
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఏడుపాయల ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయ భవనం, నీటిపారుదల శాఖ అతిధిగృహం, పోలీస్ అవుట్ పోస్టులను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
శనివారం శ్రీ ఏడుపాయల వనదుర్గమాతకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ.50 లక్షలతో యజ్ఞశాల, పాకశాల, రూ. 1.74 కోట్లతో 33/11 కెవి విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాలకు హరీశ్ రావు, తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. గత పాలకుల హయాంలో దేవాలయాలన్నీ నిరాదరణకు గురయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్రం పర్యాటక రంగాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేయాలని నిర్ణయించిందన్నారు.
ఈ మేరకు ఏర్పాటు చేసే టూరిజం సర్క్యుట్లో ఏడుపాయల వనదుర్గా పుణ్యక్షేత్రం, మెదక్ ఖిల్లా, మెదక్ చర్చి, పోచారం జింకల పార్కు పొందుపరిచి అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ కృతనిశ్చయంతో ఉందన్నారు. ఏడుపాయలకు లక్షలాది భక్తులు వస్తుంటారని, ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యాన్ని చక్కగా అమలు పర్చేందుకు రూ. 7లక్షలతో ఒక ట్రాక్టర్ను మంజూరు చేస్తున్నామన్నారు.