కేసీఆర్ బాద్యత విస్మరించారు.!కేంద్రం మోసం చేసింది.!రైతులను ఆదుకోవాలని గవర్నర్ కు కాంగ్రెస్ విజ్ఞప్తి.!
హైదరాబాద్ : తెలంగాణ రైతంగాన్ని తెలంగాణ ప్రభుత్వం నిండా ముంచిందని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నప్పటికీ ఆ వివరాలను రైతులకు చెప్పలేదని, ప్రత్యామ్నాయ పంటల గురించి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కేంద్ర బీజేపి ప్రభుత్వంపై నెపం మోపేందుకు కుట్రులు చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర బీజేపి ప్రభుత్వం కూడా స్పష్టత లేకుండా వ్యవహరించడంతో రైతుల పరిస్దితి ప్రశ్నార్ధకంగా తయారయ్యిందని, ధాన్యం కొసుగోలు అంశంలో జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నేతృత్వంలో గవర్నర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు కాంగ్రెస్ నేతలు.
ధాన్యం కొనుగోలులో జోక్యం చేసుకోవాలి.. గవర్నర్ ను కోరిన కాంగ్రెస్
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీదర్ బాబు రైతు సమస్యల గురించి మాట్లాడారు. రైతుల సమస్యలపై గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చామని, రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, వెంటనే డబ్బులు ఇప్పించేలా చేయాలని గవర్నర్ కు విన్నవించామని శ్రీదర్ బాబు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంటల విషయంలో మొండి వైఖరి అవలంభిస్తే, రైతులను కట్టడి చేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఉద్యమం చేస్తుందని శ్రీదర్ బాబు హెచ్చరించారు. రైతులకు అండగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఉన్నప్పుడే యావత్ రైతాంగం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖర్ అస్పష్టం.. రైతుకు అన్యాయం చేయొద్దన్న టీపిసిసి
యాసంగికి సంబంధించిన బాయిల్డ్ రైస్ తీసుకుంటామని ఇప్పటివరకు స్పష్టంగా చెప్పలేదని, కేంద్ర ప్రభుత్వం బాధ్యతను విస్మరించిందని, మూడు చట్టాలను ఉపసంహరించుకుని పెద్ద మనసు చాటుకున్న బీజేపి యాసంగి పంట తీసుకునే అంశంలో ఆలోచించాలని సూచించారు. యాసంగి పంట తీసుకుంటామని చెప్పాల్సిన ధర్మం కేంద్ర ప్రభుత్వం ఉందని, ఏడు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ చంద్రశేఖర్ రావు రాజకీయం చేసారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొలకెత్తిన ధాన్యంతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకున్నామని, టిఆర్ఎస్ బిజెపి పార్టీలకు ఆ చిత్తశుద్ధి లేదని శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు.
కల్లాల్లో రైతు పరిస్ధితి అల్లకల్లోలం.. ఒక సారి ప్రత్యక్షంగా సందర్శించాలని గవర్నర్ ను కోరిన కాంగ్రెస్
రైతులకు సాగు నీళ్లు ఇచ్చానంటున్నచంద్రశేఖర్ రావు, మరి రైతులు పండించిన పంటలు ఎందుకు కొనడంలేదని ప్రశ్నించారు. సీఎం కు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే వెంటనే కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చట్ట వ్యతిరేకంగా తమ పార్టీలో చేర్చుకొని వారి నోటికి చంద్రవేఖర్ రావు తాళం వేసారని మండిపడ్డారు. హుజరాబాద్ లో ఏం చేస్తే గెలుస్తామని ఆలోచించారే తప్ప రైతుల సంక్షేమం గురించి ఆలోచించలేదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని, ప్రత్యేక రాష్ట్రం చంద్రశేఖర్ రావు కుటుంబం కోసమే ఏర్పడిందా అనే సందేహాలు కలుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేసారు.
జంతర్ మంతర్ లో కాంగ్రెస్ దీక్ష.. చిత్తశుద్ది ఉంటే కేసీఆర్ పాల్గొనాలన్న కాంగ్రెస్
పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో చంద్రశేఖర్ రావుకు తెలంగాణ రైతాంగం గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు కాంగ్రెస్ నేతలు. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులను కలవాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేసామని, ఇప్పటికే 70% రైస్ మిల్లర్లకు వెళ్ళిపోయాయని, కాంగ్రెస్ హయాంలో తడిసిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొన్నామని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు నష్టం జరగకుండా ఎమ్.ఎస్.పి ధరలతో కొన్నామని గర్తు చేసారు. తెలంగాణ ప్రజలు చంద్రశేఖర్ రావుకు ఓటేస్తే ఆయన బిజెపి గురించి మాట్లాడటం హాస్యస్పదంగా ఉందని మండి పడ్డారు. ముందు కల్లాలో ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు అంశంలో డిసెంబర్12 వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయబోతున్నామని, ఆ ధర్నాకు చంద్రశేఖర్ రావాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.