కర్ణాటకతోపాటే తెలంగాణకు ఎన్నికలు??
తెలంగాణకు ముందస్తు ఎన్నికలు రావని, షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిరోజుల క్రితమే పార్టీ నేతలకు చెప్పారు. అయినప్పటికీ ఊహాగానాలు మాత్రం ఆగలేదు. ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళతారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ముందస్తు ఎన్నికలపై భారతీయ జనతాపార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కర్ణాటకతోపాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. కొన్ని నెలల్లో కర్ణాటకతోపాటు తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

డిసెంబరులో అసెంబ్లీ సమావేశాలు
డిసెంబరులో తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ సమావేశాల్లో కేంద్రం, బీజేపీ టార్గెట్గా ముందుకు సాగనున్నట్లు సమాచారం. సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులను, ఇతర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకుంటోందనే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇవ్వబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం సాయం చేయకున్నా..తెలంగాణ అభివృద్ధి ఎలా చేస్తామనే సంకేతాలు ఇవ్వనున్న కేసీఆర్.. ఇందుకోసం తాము ఏం చేస్తామనే విషయాలను కూడా అసెంబ్లీ వేదికగానే చెబుతారని సమాచారం.

చివరి సమావేశాలు కావొచ్చంటున్న గులాబీ నేతలు
బహుశా అవే చివరి అసెంబ్లీ సమావేశాలు కూడా కావచ్చని టీఆర్ఎస్ నేతలు కొందరు భావిస్తున్నారు. ఎన్నికల వ్యూహాల్లోకానీ, రాజకీయ వ్యూహాల్లోకానీ గండరగండడుగా పేరుతెచ్చుకున్న కేసీఆర్ ప్రత్యర్థులను కుదురుకునే అవకాశం ఇవ్వకుండా అకస్మాత్తుగా ఎన్నికల నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి. అందుకే ఈ రెండు పార్టీలు తమ యంత్రాంగాన్ని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి వీలుగా సన్నద్ధం చేస్తున్నాయి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలు రావని చెప్పారంటే కచ్చితంగా వస్తాయని, అందుకు తగ్గట్లుగా ఆయన గ్రౌండ్ ప్రిపేరు చేసుకోవడం కూడా అయిపోయిందని తెలుస్తోంది.

కర్ణాటక షెడ్యూల్ వచ్చే ఏడాది మే
కర్ణాటకలో షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మేకల్లా కొత్త ప్రభుత్వం కొలువుదీరాలి. కనీసం అంతకు రెండు లేక మూడు నెలల ముందు ఎన్నికల సంఘం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలోనే బీఆర్ఎస్ పేరుతో ఎన్నికలకు వెళ్లడంవల్ల ప్రయోజనముందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. జేడీఎస్ తో పొత్తు పెట్టుకొని పోటీచేయడంవల్ల కనీస సంఖ్యలో అవసరమైనన్ని ఓట్లు సాధించగలుగుతుంది. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ కు అవసరమైన ఓట్ల శాతం దక్కుతుంది. కచ్చితంగా తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని భావిస్తున్న టీఆర్ఎస్ తర్వాత జరిగే లోక్ సభ ఎన్నికలను సులువుగా ఎదుర్కోవాలని భావిస్తోంది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో మాత్రం మునుగోడు ఉప ఎన్నికతో ప్రారంభమైన పొలిటికల్ హీట్ అసెంబ్లీ ఎన్నికలు జరిగేవరకు కొనసాగే వీలుంది.












Click it and Unblock the Notifications