నమ్మించి గొంతుకోయడం కేసీఆర్ కు అలవాటే.!సీఎం అహంకారాన్ని హుజురాబాద్ ప్రజలు బొందపెట్టారన్న ఈటల
హైదరాబాద్: తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు పైన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి మండిపడ్డారు. చంద్రశేఖర్ రావు చాలా మందిని నమ్మించి గొంతుకోసినట్టే తనను కూడా రాజకీయ సమాధి చేసేందుకు కుట్ర చేసారని సంచలన ఆరోపణలు చేసారు. ప్రగతిభవన్లో కూర్చుని, హుజూరాబాద్లో హరీష్రావుని పెట్టి, ఎమ్మెల్యేలు, ఎంపీలతో హుజురాబాద్ ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని, పోలీసులతో బెదిరింపులకు గురిచేసి ఓటర్లను మభ్యపెట్టారని ఘాటు విమర్శలు చేసారు. ప్రజాస్వామ్య చరిత్రలో వందల కోట్లు ఖర్చు పెట్టి తనపై రాజకీయ దాడి చేశారని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేపారు. అందుకే చంద్రశేఖర్ రావు అహంకారాన్ని హుజూరాబాద్ ప్రజలు పాతరేశారని ఈటల పేర్కొన్నారు.

కేసీఆర్ పైన భగ్గుమన్న ఈటల..
అంతే కాకుండా ప్రజాస్వానకి ఎన లేని గౌరవాన్ని కల్పిస్తూ ఊహించని విజయాన్ని అందించిన హుజూరాబాద్ ప్రజలకు తన విజయాన్ని అంకితం ఇస్తున్నట్టుగా ఈటల ప్రకటించారు. చంద్రశేఖర్ రావు కు హుజూరాబాద్ ప్రజలు చెంప చెల్లుమనిపించేలా జవాబిచ్చారని, ఎన్నికల నిబంధనలు పక్కనపెట్టి దళితబంధును తెచ్చినప్పటికి దళితులు చంద్రశేఖర్ రావు ను విశ్వసించలేదని ఈటల తెలిపారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒక్కటై తనను ఓడించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. తప్పని పరిస్థితుల్లో పార్టీ మారినా తనను గుర్తుపెట్టుకుని ప్రజలు ఓటేశారని ఈటల గుర్తు చేసారు.

మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసీఆర్ కు నమ్మకం ఉండదు..
ఇదిలా ఉండగా తన గెలుపును ప్రజలు ఆస్వాదించకుండా చేయాలని, చంద్రశేఖర్ రావు చిల్లర పనులు, కుట్రలు చేశారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.
హుజూరాబాద్ ఓటమి దెబ్బతో చంద్రశేఖర్ రావుకు దిమ్మ తిరిగిందని, ఈటల రాజేందర్ ను ఒక్కడిని ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేసిన ఘటన తెలంగాణ సమాజానికి అర్థమైందని, చరిత్రలో ఎక్కడా లేని విధంగా తన వల్ల దళితబంధుతో పాటు హుజూరాబాద్లో ఊహించని అభివృద్ధి జరిగిందన్నారు ఈటల రాజేందర్.
అసలు మంత్రులు, ఎమ్మెల్యేల మీద చంద్రశేఖర్ రావుకు నమ్మకం లేదని, వారి ఫోన్లు ట్యాప్ చేస్తూ, అందరిపై నిఘా పెడుతున్నారని, నమ్మించి ఎప్పుడు గొంతుకోస్తాడో అని టీఆర్ఎస్ నేతలకు కూడా చంద్రశేఖర్ రావు పై అపనమ్మకం ఏర్పడిందని సంచలన వ్యాఖ్యలు చేసారు ఈటల.

స్వయం పాలన అనుకుంటే కుటుంబ పాలన వచ్చింది..
అంతే కాకుండా స్వయం పాలన అనుకుంటే కుటుంబ పాలన అయ్యిందని తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఎడమకాలి చెప్పుతో సీఎం కుర్చీని పోల్చి, చంద్రశేఖర్ రావు తన అహంకారాన్ని చాటుకున్నారని ఈటల మండిపడ్డారు. తెలంగాణ సాధించానని చెప్పుకుంటున్న చంద్రశేఖర్ రావును తెలంగాణ ప్రజలు ఛీ కొడుతున్న అంశం ఇంకా ఆయన దృష్టికి వచ్చినట్టు లేదని తెలిపారు. ధరణి వెబ్సైట్లో వచ్చిన తప్పులు దిద్దుకునేందుకు పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ధరణి వచ్చాక హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని, ధరణి కింద ఎంతమంది నలిగిపోయారో చంద్రశేఖర్ రావు తెలియదని ఈటల ధ్వజమెత్తారు.
Recommended Video

పార్టీలు మారే తత్వం కాదు..
ఇదిలా ఉండగా తెలంగాణ ప్రజల కోసం పాటుపడటమే తన ముందున్న లక్ష్యమని, తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని, పూటకో మాట మాట్లాడే వ్యక్తిని అసలే కాదని ఈటల స్పష్టం చేసారు. చంద్రశేఖర్ రావు పార్టీ నుండి గెంటేస్తే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చానని, తనకు తానుగా బయటకి రాలేదని ఈటల రాజేందర్ గుర్తు చేసారు. బీజేపీలో తనను ప్రోత్సహించి, స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించారని, రాష్ట్రం, దేశం బాగుకోసం పాటుపడటమే తన జీవత ధ్యేయమని ఈటల రాజేందర్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications