ఢిల్లీలో కేసీఆర్ ధర్నా..!! - నేడే కార్యాచరణ ప్రకటన : టార్గెట్ బీజేపీ - కేంద్రం..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రాజకీయ కార్యాచరణ ప్రకటించనున్నారు. కేంద్రం పైన రాజకీయ పోరాటం చేస్తున్న సీఎం కేసీఆర్, ఇప్పుడు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కొత్త అస్త్రాలు సిద్దం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ వరి అంశం ఆయుధంగా పోరాటానికి సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. అందులో పోరాట షెడ్యూల్ ను ప్రకటించనున్నారు.
టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంస్ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు హాజరు కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

వ్యూహం మార్చిన సీఎం కేసీఆర్
యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలన్న డిమాండ్తో... ధర్నాలు, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు సమావేశంలో కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఈ సాయంత్రం కేసీఆర్.. కేబినెట్ మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి డిమాండ్ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.
నవంబరులోను ధాన్యం కొనుగోలు కోసం దిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ఆ సమయంలో ప్రధానిని కలవలేకపోయారు. దీంతో..ముందుగానే ఇప్పుడు సీఎంఓ ప్రధాని అప్పాయింట్ మెంట్ కోరింది. అవసరమైతే ప్రధాని సహా కేంద్రమంత్రులతో భేటీకోసం 3, 4 రోజులు కేసీఆర్... దిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం.

ఢిల్లీ కేంద్రంగా ఇతర పార్టీలను ఆకర్షించేలా
సమస్య పరిష్కారమయ్యాకే హైదరాబాద్ రావాలని భావిస్తున్నారు. ఇక, ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ.. లోక్సభలో, రాజ్యసభలో తెరాస ఎంపీలు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టేలా వ్యూహాలు సిద్ధం చేశారు. ఈ మేరకు ఎంపీలకు ఇప్పటికే కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అవసరమైతే దిల్లీలో ధర్నాకు దిగాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీలో ముఖ్యమంత్రి ..పార్టీ అధినేత హోదాలో ధర్నా చేయటం ద్వారా కలిసొచ్చే పార్టీలు సభలో ఇదే అంశం పైన కేంద్రాన్ని నిలదీసేలా వ్యూహాన్ని సిద్దం చేస్తున్నారు. ఢిల్లీ చేరగానే సఖ్యతగా ఉన్న ఇతర పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.

ఢిల్లీలో అవసరమైతే సీఎం ధర్నా
వారితో తెలంగాణలో వరి కొనుగోళ్ల అంశం పైన పూర్తి వివరాలు అందించనున్నారు. పంజాబ్ వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వమే సేకరిస్తున్నందున... రాష్ట్రంలో వరి ధాన్యాన్ని కూడా పూర్తిగా ఎఫ్సీఐ సేకరించాలని తెరాస డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో కలిసి ఇదే అంశం పైన ధర్నా చేసారు.
ఇక, ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా ధర్నాకు సీఎం కేసీఆర్ సమాయత్తం అవుతున్నారు. దీని ద్వారా జాతీయ రాజకీయాల్లోనూ కేసీఆర్ కొత్త వ్యూహాలతో అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. దీంతో..ఢిల్లీ కేంద్రంగా ఇప్పుడు కేసీఆర్ వేసే రాజకీయ అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications