బాబు కథ పెద్దగా ఉంది, పీకల్లోతు కూరుకుపోయాడు: కెసిఆర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్రంగా స్పందించారు. తనను అరెస్టు చేసిన రోజే కెసిఆర్ ప్రభుత్వానికి చివరి రోజు అవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దానిపై కెసిఆర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. చంద్రబాబు హైదరాబాదులో గెస్ట్ చీఫ్ మినిస్టర్ అని, హైదరాబాదులో చంద్రబాబు పరిధి ఉండదని ఆయన అన్నారు. మంత్రి వర్గ సమావేశానంతరం కెసిఆర్ బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడారు.
నువ్వే కాదు, నీ తాత జేజేమ్మ కూడా మా వెంట్రుకను పీకలేరని కెసిఆర్ చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. తన రాష్ట్రంలో తన ఎమ్మెల్యేలను కొంటానని, అది బయటపెడితే గాయి చేస్తావా అని అన్నారు. చంద్రబాబు కథ చాలా పెద్దగా ఉందని, పీకల్లోతు కూరుకుపోయాడని, అది తాను చెప్పకూడదని, అయితే ప్రభుత్వాధినేతగా తనకు అందే సమాచారం అందుతుందని ఆయన అన్నారు.
తమ శాసనసభ్యులను కొనుగోలు చేయడానికి చంద్రబాబును అనుమతిస్తే తమ ప్రభుత్వాన్ని కూలుస్తాడు కదా అని అన్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయితే కొంటావా అని అన్నారు. కాంగ్రెసుకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను టిడిపివాళ్లు కొన్నారని, తాను కాంగ్రెసు నాయకులకు చెప్పానని, తెలంగాణ ఎమ్మెల్యేలను బెదిరించారని, తాను ముందుకు వస్తున్నానని చంద్రబాబు చెప్పాడని అన్నారు. ఇంకా చాలా జరిగేవని, ఒక్కరు పట్టుబడడంతో ఆగిపోయిందని ఆయన అన్నారు. గాయి చేసినంత మాత్రాన చట్టం నుంచి తప్పించుకోలేరని, చట్టం తన పని తాను చేసుకుని పోతుందని ఆయన అన్నారు.
టేపులు టీవీలో రావడమనేది మీడియా స్వేచ్ఛకు సంబంధించిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ఎవరి ఫోన్లను కూడా ట్యాప్ చేయలేదని, ఎసిబి డైరెక్టర్ జనరల్ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారని ఆయన అన్నారు. సెక్షన్ 8 పెట్టినా ఎసిబి దాని పరిధిలోకి రాదు, తెలుసా అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరంగా ఏర్పడిందని, తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా ఏర్పాటయిందని, ఏ ప్రభుత్వం కూడా పరిమితులు దాటి వ్యవహరించదని ఆయన అన్నారు.
తనెందుకు అరెస్టు చేస్తానని, ఎసిబి చేస్తుందని ఆయన అన్నారు. నేరగాళ్లను అరెస్టు చేసేది ప్రభుత్వం కాదని, ఏజెన్సీలున్నాయని ఆయన అన్నారు. తమకు ఐదుగురు ఎమ్మెల్సీలను గెలిపించుకునే బలం ఉందని లెక్కలు వేసుకున్నామని ఆయన అన్నారు. మెజారిటీ లేని చంద్రబాబు అభ్యర్థిని ఎందుకు పెట్టారని ఆయన అడిగారు.
ప్రధాని మోడీ చంద్రబాబును సమర్థిస్తారని అనుకోవడం లేదని ఆయన అన్నారు. తాను తమిళనాడుకు వెళ్తే తమిళనాడు ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని, తెలంగాణ మిగతా రాష్ట్రాల మాదిరి రాష్ట్రం కాదా అని అన్నారు. చంద్రబాబు భద్రత మార్పుపై తెలంగాణ డిజిపి కేంద్రానికి ఫిర్యాదు చేస్తారని ఆయన అన్నారు. ఉమ్మడి రాజధాని పేరుతో తెలంగాణను శాసించాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం 120 ఫోన్లను ట్యాప్ చేస్తే ఎపి ప్రభుత్వం ఏం చేస్తోందని, మే 31వ తేదీ తర్వాతనే యాదికి వచ్చిందా అని అడిగారు. ఫోన్లు ట్యాప్ చేస్తుంటే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆయన అడిగారు. ఏడాది అంతా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన అన్నారు. చంద్రబాబు గాయి చేసి సాధించేదేమీ లేదని, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దొంగను బలపరుస్తుందని అనుకోవడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు పరిస్థితి ఏమీ బాగా లేదని, తన కాళ్ల కిందికి నీళ్లు తెచ్చుకున్నాడని ఆయన అన్నారు. హై హ్యాండెడ్నెస్తో వ్యవహరించేది చంద్రబాబు మాత్రమేనని ఆయన అన్నారు.
మడుగుల పడ్డ దున్నపోతు అందరికీ బురద పూసినట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు దొరికిన దొంగ అని కెసిఆర్ అన్నారు. నువ్వు పెద్ద మనిషిని అని అనుకుంటున్నావు, నీకు పార్టీ ఫిరాయింపులు వర్తించవా అని చంద్రబాబును అడిగారు. ఎస్పీవై రెడ్డి ఏ పార్టీ తరఫున గెలిచారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారని, కొత్తపల్లి గీత ఏ పార్టీ తరఫున గెలిచారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారని ఆయన చంద్రబాబును అడిగారు.
వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులను ఆరుగురిని, ఓ స్వతంత్ర శాసనసభ్యుడిని చంద్రబాబు తీసుకున్నారని ఆయన అన్నారు. దానికి చంద్రబాబు ఏం సమాధానం చెప్పారని ఆయన అడిగారు. ఆరుగురు కాంగ్రెసు ఎమ్మెల్సీలను, ముగ్గురు వైసిపి ఎమ్మెల్సీలను చంద్రబాబు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. నువ్వు చేర్చుకుంటే నీతి, టిడిపిని ప్రజలు దారుణంగా తిరస్కరించిన తర్వాత తమ వైపు వచ్చినవారిని తాము తీసుకుంటే తప్పవుతుందా అని అడిగారు.
చంద్రబాబు ఎవరి కాళ్లు పట్టుకున్నా నోటుకు ఓటు కేసు నుంచి తప్పించుకోలేరని ఆయన అన్నారు. చంద్రబాబు అందితే రాళ్లు, అందకుంటే కాళ్లు పట్టుకుంటారని ఆయన అన్నారు. చంద్రబాబు, ఆయన అనుచరులు చాలా మందితో మాట్లాడారని, ఒక ముఠా బయటపడిన తర్వాత మిగతా ముఠాలు మాయమయ్యాయని ఆయన అన్నారు.
రేవంత్ రెడ్డిపై స్టీఫన్ సన్ ఫిర్యాదుతో ఎసిబి దర్యాప్తు చేపట్టిందని ఆయన అన్నారు. ట్యాప్ అంటారు, కట్ అండ్ పేస్ట్ అంటారు, అసలు వాయిస్ నీదా, కాదా చెప్పాలని చంద్రబాబును అడిగారు. చంద్రబాబు స్టీఫెన్ సన్తో మాట్లాడాడా, లేదా అని ఆయన అడిగారు. దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు. చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారని, పునర్విభజన చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని ఆయన అన్నారు. కేంద్రం ప్రభుత్వం వేసిన నీరజా మాథూర్ కమిటీ చంద్రబాబును హెచ్చరించిందని ఆయన అన్నారు.
అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి, అరిచి గాయి చేసి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని చంద్రబాబు అనడంపై అదే అహంకారంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఏమైనా రాష్ట్రపతా అని అడిగారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వ్యక్తి ఏ అధికారంతో మాట్లాడుతారని ఆయన అడిగారు. ఎవరి చరిత్ర ఏమిటో గవర్నర్ ఏడాదిగా చూస్తున్నారని ఆయన అన్నారు. స్టింగ్ అయితేంది, బింగ్ అయితేంది దొరికనవా, లేదా అని చంద్రబాబును ప్రశ్నించారు.