ఎల్లుండే కేసీఆర్ ఖమ్మం సభ: ఒక్క మాటలో చెప్పాలంటే..?!
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. మొన్నటి వరకు మనుగడలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి- భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తరువాత ఇక పార్టీ విస్తరణ కార్యకలాపాలపై కసరత్తు చేస్తోన్నారు. అటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిరాటంకంగా కొనసాగిస్తూనే- జాతీయ రాజకీయాలకు మరింత పదును పెడుతున్నారు..క్రియాశీలకంగా వ్యవహరించబోతోన్నారు.

బీఆర్ఎస్ గా..
గత ఏడాది కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా బదలాయించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు డిసెంబర్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని తరువాత బీఆర్ఎస్ కార్యకలాపాలు జోరందుకున్నాయి. దేశ రాజధానిలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు కేసీఆర్. పొరుగు రాష్ట్రాలపైనా పార్టీని విస్తరించడంపై దృష్టి సారించారు.

ఏపీలో విస్తరణ..
ఊహించిన దాని కంటే వేగంగా బీఆర్ఎస్.. ఏపీలో అడుగు పెట్టింది. చేరికలకు గేట్లు ఎత్తేసింది. ఫలితంగా- పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, పార్థసారథి తదితరులు.. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాను కప్పుకొన్నారు. ఇక- ఈ సంక్రాంతి తరువాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకలాపాలను విస్తరించడానికి పార్టీ నాయకులు సన్నాహాలు మొదలు పెట్టారు.

18న భారీ బహిరంగ సభ..
ఈ పరిణామాల మధ్య బుధవారం ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు గులాబీ బాస్. జాతీయ స్థాయి రాజకీయ నాయకులందరూ తన వైపు చూపు సారించేలా ఈ సభను ప్లాన్ చేశారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన తరువాత ఈ స్థాయిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోండటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివిధ పార్టీల నాయకులు దీనికి హాజరు కానున్నారు.

జాతీయ రాజకీయాలకు వేదిక..
100 ఎకరాల స్థలంలో ఈ సభను నిర్వహించడానికి బీఆర్ఎస్ నాయకులు సన్నద్ధం అయ్యారంటే వారి లక్ష్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. లక్షలాది మంది ప్రజలు దీనికి హాజరవుతారని చెబుతున్నారు. జాతీయ స్థాయి రాజకీయ పార్టీల ఫోకస్ మొత్తం తనవైపు తిప్పుకొనేలా బీఆర్ఎస్ నాయకులు ఈ సభను నిర్వహించనున్నారు. తమ సత్తాను చాటిచెప్పడానికి దీన్ని వేదికగా మలచుకోనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఖమ్మం సభ- బీఆర్ఎస్ జాతీయస్థాయి రాజకీయాలకు ఓ ప్రధాన వేదికగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

హాజరయ్యేది వీరే..
ఖమ్మం సభకు ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, భగవంత్ మాన్ హాజరు కావడం ఖాయమైంది. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. ఇందులో పాల్గొననున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమార స్వామి సైతం ఈ సభకు వస్తారనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications