హీరో కృష్ణ అభిమానిని అన్న సీఎం కేసీఆర్
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ అంటే తనకు ఎంతో అభిమానం అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం అన్నారు. తెలంగాణలో తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పటికంటె పదిరెట్లు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మొత్తం ఐదువేల ఎకరాలలో ఫిల్మ్ సిటీని అభివృద్ధి చేస్తామన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి ఎదగాలన్నారు. కాగా, హైదరాబాదులో నాలుగు వేళ ఎకరాల్లో అద్భుతమైన ఫిలిం సిటీని నిర్మిస్తామని, ఫిలిం సిటీ బోర్డులో కృష్ణను సభ్యుడిగా నియమిస్తామని కేసీఆర్ చెప్పారు.
చెరువుల పునరుద్ధరణ
రాష్ట్రంలోని 45000 చెరువులకు రూ.22,500 కోట్లతో పూడికతీత, మరమ్మతు, పునరుద్ధరణ పనులను చేపట్టనున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు వేరుగా అన్నారు. శనివారం ఆయన మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం సికింద్లాపూర్ గ్రామంలో వాటర్ ప్లాంటును ప్రారంభించి మాట్లాడారు. ప్రతి చెరువులో నీళ్లు ఉంటే ఆ గ్రామాలు బాగు పడుతాయని, రైతాంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకిచ్చే స్పింక్లర్లను నిలుపుదల చేసిందన్నారు. త్వరలో రైతులకు స్పింక్లర్లు అందించే చర్యలు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా రైతులకు వ్యవసాయానికి పీవీసీ పైపులు సబ్సిడీ మీద ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం 17 వేల కోట్ల రుణమాఫీకి కట్టుబడి ఉందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తిచేసి లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూల్ నియోజకవర్గంలో శనివారం వేర్వేరు చోట్ల జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లాలో మొదటి విడతగా సునందినీ పథకం కింద 162 మంది డ్వాక్రా మహిళలకు కోటి 30లక్షల వడ్డీ లేని రుణాన్ని ఆయన అందజేశారు.