టీడీపీకే కాదు, సొంత పార్టీ వారికీ కేసీఆర్ చెక్? ఆ భయం కూడా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓటుకు నోటు వ్యవహారం ద్వారా కేవలం తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపించడమే కాకుండా, సొంత టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తులకు చెక్ చెప్పారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలైన ఏపీ, టీఎస్లలో రాజకీయ వేడి రాజేస్తున్న విషయం తెలిసిందే. ఓటుకు నోటు ద్వారా కేసీఆర్... 'ఒక్క దెబ్బకు రెండు పెద్ద పిట్టలు' సాధించారని అంటున్నారు.
ఈ వ్యవహారంతో తెలంగాణలో టీడీపీ మరింత దెబ్బతింటుందని తెరాస నేతలు చెబుతున్నారు. హరీష్ రావు, కవిత వంటి నేతలు మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీకి నూకలు చెల్లాయని వ్యాఖ్యానించారు. అయితే, ఇలాంటి వ్యాఖ్యలు గత కొన్నేళ్లుగా చూస్తున్నామని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
ఏదేమైనా ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీని చిక్కుల్లో పెట్టిందనే చెప్పవచ్చు. అయితే, టీడీపీతో పాటు సొంత పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలకు కూడా చెక్ పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ తన ఏడాది పాలనలో ఆపరేషన్ ఆకర్ష్ మినహా చేసిందేమీ లేదని విపక్షాలు మొన్నటి వరకు నిప్పులు చెరిగాయి. ఓటుకు నోటుతో ఇరు రాష్ట్రాల్లో దాదాపు అన్ని అంశాలు పక్కన పడ్డాయి. కేవలం దీని పైన చర్చ సాగుతోందని చెప్పవచ్చు.
గత ఏడాదిగా టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలకు చెందిన ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. కడియం శ్రీహరి, మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలు పలువురు చేరారు.
కడియం, మహేందర్ రెడ్డి, తలసాని వంటిలను కేబినెట్లోకి తీసుకోవడంపై విపక్షాలు పెద్ద ఎత్తున మండిపడ్డాయి. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న వారిని పక్కన పెట్టి ద్రోహులకు కేబినెట్లో చోటు కల్పిస్తున్నారని కేసీఆర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
పైకి చెప్పనప్పటికీ.. తెరాసలోని పలువురు నేతల్లోను ఈ అసంతృప్తి ఉందనే వాదనలు ఎప్పటికప్పుడు వచ్చాయి. ఏళ్లుగా ఉద్యమంలో పాలుపంచుకొన్న తమకు పదవులు ఇవ్వకుండా.. నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి ఇవ్వడం పైన లోలోన పలువురిలో అసంతృప్తి ఉందనే వాదనలు వినిపించాయి.
అయితే నోటుకు ఓటు వ్యవహారం ద్వారా కేసీఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంటును రాజేశారని, తద్వారా మళ్లీ ఆధిపత్యాన్ని చాటుకున్నారని, దీంతో టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తులు మరోసారి పెదవి విప్పని పరిస్థితి వచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఈ రోజు రేవంత్ రెడ్డికి ఎదురైందే తమకూ ఎదురు కావొచ్చని, పలువురిలో ఫోన్ ట్యాపింగ్ భయం కూడా పట్టుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.