నోట్ల రద్దు చర్చ, తెలంగాణానే నెం. 1 : కేసీఆర్, జానా పోటాపోటీ
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దును తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చెప్పారు. ఆయన శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. నల్లధనం, నకిలీ కరెన్సీని నిర్మూలించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు.
పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన ప్రజల సమస్యలపై ప్రధాని, ఆర్బీఐతో చర్చించామని కేసీఆర్ తెలిపారు. ఢిల్లీ వెళ్లి సమస్యలను మోడీకి వివరించానని తెలిపారు. ప్రధానిని కలిసి నోట్ల సమస్యలపై వివరించానని తెలిపారు. నగదు రహిత లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. నగదు సమస్యలపై జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సిద్ధిపేటను నగదురహిత జిల్లాగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విధి విధానాల అమలుకు సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు.
ఇప్పటి వరకు తెలంగాణకు రూ.19,109కోట్ల నగదు వచ్చాయని తెలిపారు. గ్రామాలను నగదు రహితంగా మార్చాలని కలెక్టర్లను ఆదేశించామని కేసీఆర్ తెలిపారు. నల్లధనం అరికట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. అంతేగాక, తెలంగాణకు రూ. 5వేల కోట్ల విలువైన నోట్లను పంపించాలని కోరినట్లు తెలిపారు.
సమస్యలను పరిష్కరించాలి: జానా రెడ్డి
పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన ప్రజల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి జానా రెడ్డి కోరారు. అన్ని పార్టీలు ప్రజల పక్షాన నిలవాలని అన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం నల్లధనం, నకిలీనోట్లు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాలపై చూపిందని తెలిపారు. అయితే, ప్రజలు కూడా నగదు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
నోట్ల రద్దు ఆశయానికి మనమందరం సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్రం ప్రభుత్వం ప్రణాళిక రహితంగా, అనాలోచితంగా బాధ్యత రహితంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని జానా రెడ్డి ఆరోపించారు.
మన రాష్ట్రం పరిధి కాదు
నోట్ల రద్దు అనేది మన రాష్ట్ర పరిధిలోని అంశం కాదని, అందుకే దీనిపై చర్చ మాత్రమే నిర్వహిద్దామని, విమర్శలు చేయకూడదని కేసీఆర్.. ప్రతిపక్షాలకు మనవి చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మన రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులున్నాయని, వాటిపైనే మనం చర్చించుకుందామని సూచించారు. అనాలోచిత నిర్ణయమనో, సరైన నిర్ణయం కాదని అనడం సరికాదని అన్నారు. కేంద్ర పాలసీని విమర్శించడం తగదని అన్నారు. నోట్ల రద్దు ప్రభావంపై మాత్రమే చర్చించుకుందామని అన్నారు. సమస్యలను చెబితే ప్రధానికి తెలియజేస్తానని కేసీఆర్ చెప్పారు.
రైతులు, వ్యాపారుల ఇబ్బందులు: జానా
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అనేకమంది ఉద్యోగాలు కోల్పోతున్నారని జానారెడ్డి తెలిపారు. కార్మికులకు కూలీ దొరకడం లేదని, చిన్న వ్యాపారాలు సవ్యంగా సాగడం లేదని చెప్పారు. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం కానీ, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తాము విమర్శించడం లేదని, సమస్యలను తెలియజేస్తున్నామని చెప్పారు. బిజెపి సభ్యురాలు మీనాక్షి లేఖి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడేందుకు ప్రయత్నించగా మరోసారి కేసీఆర్ అడ్డు చెప్పారు.
ఆ అంశాలు వద్దు: కేసీఆర్
వాస్తవానికి సభలో పెద్ద నోట్ల రద్దు చర్చించదగిన సమస్యే కాదని సీఎం కేసీఆర్ చెప్పారు. సభలో లేని వారి పేరు తీసి మాట్లాడటం సరికాదని అన్నారు. కేంద్రం నిర్ణయంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలపైనే చర్చించుకుందామని మరోసారి సూచించారు. యూపీఏ, ఎన్డీఏ పాలసీలపై చర్చవద్దని స్పష్టం చేశారు.
ఎలా సాధ్యం: జానా
పెద్ద నోట్ల రద్దుతో చిల్లర లభించక ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జానా రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత తక్కువని, స్వైపింగ్ సేవలు అమలు చేయడం చాలా కష్టమని అన్నారు. నగదు రహిత వ్యవహారాలు పూర్తిగా సాధ్యం కాదని చెప్పారు. ప్రభుత్వంపై మరో ఆరు నెలలపాటు నోట్ల ర్దదు ప్రభావం ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తాను బహిర్గతంగా బాధపడుతున్నానని, కేసీఆర్ అంతర్గతంగా బాధపడుతున్నారని జానా అన్నారు. దీంతో కేసీఆర్ కాసేపు నవ్వారు. కాగా, 20వేల కోట్లు సర్కూలేషన్లో ఉండాలని కేసీఆర్ అన్నారని జానా అనగానే.. తాను అలా అనలేదని కేసీఆర్ జవాబిచ్చారు.
తెలంగాణనే నెంబర్ 1: కేసీఆర్
రాష్ట్రంలో 20వేల కోట్లు సర్కూలేషన్లో ఉండాల్సిందని తాను అనలేదని, 70వేల కోట్లు సర్కూలేషన్లలో ఉండాల్సిందని చెప్పారు. ఇది ఆర్బీఐ చెప్పిన లెక్కేనని తెలిపారు. నోట్ల రద్దుతో ఇందులో 86శఆతం నోట్లు డెడ్ అయిపోయాయని అన్నారు. నోట్ల రద్దుతో దేశంలోని అన్ని రాష్ట్రాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆర్థిక నిపుణులు, ఆర్బీఐ మాజీ గవర్నర్లు కూడా స్వాగతిస్తున్నారని చెప్పారు. తాను నోట్ల రద్దు ప్రకటన తర్వాత ఫైనాన్స్ సెక్రటరీని కలిశానని చెప్పారు. 3నెలలపాటు సమస్యలుంటాయని, ఆ తర్వాత సమస్య పరిష్కారమవుతుందని ఆయన చెప్పినట్లు తెలిపారు. నగదు రహిత లావాదేవీల్లో గుజరాత్ ముందుందని, అయితే, తెలంగాణ రాష్ట్రం కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రమే నెం. 1 అని కేసీఆర్ తెలిపారు.
నష్ట పరిహారం ఇవ్వండి: జానా
నోట్ల రద్దు అనంతరం ఆ ప్రభావంతో రాష్ట్రంలో మరణించిన వారికి సంతాపం తెలపాలని, వారికి నష్ట పరిహారం కూడా అందించాలని జానా రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.