కంటివెలుగుతో దేశం దృష్టిని ఆకర్షించే వ్యూహం..ఆ సీఎంల సాక్షిగా కేసీఆర్ సంక్షేమ మంత్రం!!
తెలంగాణ సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా రాజకీయాలు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశ రాజకీయాల కోసం వాడుకోనున్నారు. తాజాగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈనెల 18వ తేదీ నుండి కొనసాగించనున్న నేపథ్యంలో కంటి వెలుగు ద్వారా దేశం దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సీఎం కేసీఆర్.

కంటి వెలుగుతోనూ కేసీఆర్ ప్లాన్
సీఎం కేసీఆర్ ఏ పని చేసినా ఒక అర్థం, దాని వెనుక భవిష్యత్తు వ్యూహం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ గా చూపిస్తూ సంక్షేమంలో, అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా ఈనెల 18వ తేదీన ఖమ్మంలో జరగనున్న బి ఆర్ ఎస్ ఆవిర్భావ సభ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

కంటి వెలుగు కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఆ రాష్ట్రాల సీఎంలు
ఇక రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాలకు చెందిన మాజీ ముఖ్య మంత్రులు సైతం హాజరుకానున్నారు. వీరందరి సమక్షంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంతమాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లను ఆహ్వానించిన తెలంగాణ సీఎం కేసీఆర్, సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ని కూడా ఆహ్వానించారు.

సంక్షేమ మంత్రంతో దేశం దృష్టిని ఆకట్టుకునే పనిలో కేసీఆర్
ఇక ఈ సభ వేదికగా ప్రజలందరి కంటి ఆరోగ్యం కోసం నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారన్న విషయాన్ని దేశ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుంచి తెలంగాణ సంక్షేమాన్ని దేశంలో అమలు చేస్తామని చెబుతూ, సంక్షేమ మంత్రంతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న కెసిఆర్ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కూడా జాతీయస్థాయిలో మైలేజ్ కోసం, జాతీయంగా ప్రజలను ఆకట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

కంటి వెలుగు దేశంలోనే ఎక్కడా లేని సామూహిక కంటి ఆరోగ్య కార్యక్రమం
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి 250 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సామూహిక కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గొప్పదనం తెలంగాణ రాష్ట్రానిది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ కు పట్టం కడితే ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కంటి వెలుగుతోను సరికొత్త వ్యూహంతో దేశ ప్రజలను ఆకర్షించే పనిలో ఉన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.












Click it and Unblock the Notifications