పేదల కడుపు నిండితేనే నిజమైన పండుగ: కెసిఆర్
హైదరాబాద్: పేదలు కడుపు నిండా తిన్నప్పుడే నిజమైన పండుగ అని, పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. హైదరాబాదులోని రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం శనివారంనాడు నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు మన్మథనామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మన్మథనామ సంవత్సరం 29వది, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర 29వది అని సీఎం గుర్తు చేశారు.
ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పారిశ్రామిక విధానాన్ని ప్రకటించామని, వనరులు సద్వినియోగం చేసుకుంటే అంతా మంచే జరుగుతుందన్నారు. వ్యవసాయరంగానికి మరింత ప్రోత్సాహం అందిస్తామని, ఏ రకమైన పంటలైనా రాష్ట్రంలో పండుతాయని, విత్తనోత్పత్తి భాండాగారంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు.

ఇక నుంచి రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని, విద్యుత్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తామని, మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ర్టాన్ని తీర్చి దిద్దుతామని చెప్పారు. పాలమూరు-నక్కలగండి ఎత్తిపోతలకు వారం రోజుల్లో శంకుస్థాపన చేస్తామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతకు విఘాతం లేకుండా చేస్తామని, బాసర నుంచి భద్రాచలం వరకు పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామని అన్నారు.

వనరులను సద్వినియోగం చేసుకుంటే అంతా మంచే జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ముఖ్యమంత్రి తన చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు అందించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సభాపతి మధుసూదనాచారి, మంత్రులు ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి, పలువురు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications