చిరకాల కోరిక తీరిందిలా: సంగారెడ్డి జైల్లో కేరళ సంపన్నుడు(పిక్చర్స్)
Recommended Video
హైదరాబాద్/సంగారెడ్డి: అతనో ప్రముఖ నగల వ్యాపారి. కేరళ రాష్ట్రానికి చెందిన సంపన్నులలో ఒకరు. కానీ, అతనికి ఓ కోరిక ఉండేది. ఆ చిరకాల కోరికను తీర్చుకునేందుకు ఆయన తెలంగాణలోని సంగారెడ్డికి వెళ్లారు. అక్కడ జైలు ఖైదీగా మారి ఆ అనుభవాన్ని స్వయంగా చవి చూశారు. తనకు ఈ అనుభూతినిచ్చిన ఆ జైలు అధికారులకు ఆయన ధన్యవాదాలు కూడా తెలిపారు.
ఆయనే బాబీ చెమ్మనూర్.. కేరళకు చెందిన చెమ్మనూర్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఛైర్మన్. సరదా కోసం ఆయన సంగారెడ్డి జైల్లో ఒకరోజంతా ఖైదీగా గడిపారు.. సాధారణ ఖైదీలు వేసుకునే దుస్తులను ధరించారు. వారికిచ్చే చిప్పకూడూ తిన్నారు. అంతేగాక, ఇందుకోసం ఆయన రూ.500 కూడా చెల్లించారు.
ఫీల్ ది జైల్
‘ఫీల్ ది జైల్'లో భాగంగా ఒకరోజు అతిథి ఖైదీగా గడిపేందుకు సంగారెడ్డిలోని జిల్లా పాత జైలు(మ్యూజియం)కు సోమవారం బాబీ చెమ్మనూర్ వచ్చారు. సాధారణ వ్యక్తులు ‘అతిథి ఖైదీలుగా' గడిపేందుకు తెలంగాణ జైళ్లశాఖ ఇక్కడ అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే.
స్నేహితులతో కలిసి
ఈ విషయం తెలుసుకున్న బాబీ తన స్నేహితులు అషీర్అలీ, ప్రశాంత్, వినయ్లతో కలిసి ఇక్కడికి వచ్చారు. జైలు అధికారులను కలిసి తమ కోరికను వివరించారు. దీంతో అధికారులు వారికి ఖైదీలకు ఇచ్చే దుస్తులను అందజేశారు. జైలు నిబంధనలు, ఖైదీల ఆహార నియమాల గురించి తెలిపారు.
చిరకాల కోరిక తీరిందిలా..
కాగా, జైల్లో గడిపేందుకు తనకు, తన మిత్రులకు కలిపి రోజుకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున నలుగురికి రూ.2000 రుసుం చెల్లించారు. ఒకరోజైనా జైలు జీవితం గడపాలనేది తన చిరకాలపు కోరిక అని ఇందుకోసం 15 ఏళ్ల క్రితమే ఓ పోలీసు అధికారిని సంప్రదించానని బాబీ చెమ్మనూర్ మీడియాకు వివరించారు.
నేరం చేసిన వారికేనని.. కానీ
అయితే నేరం చేసిన వారికి మాత్రమే జైలుకు వచ్చే అవకాశం ఉంటుందని.. ఇతరులెవరూ రాకూడదని సదరు అధికారి తెలిపారన్నారు. సంగారెడ్డి జిల్లా జైలుకు అతిథిగా వచ్చి జైలు జీవితం గడిపేందుకు కల్పిస్తున్న అవకాశం గురించి ఇటీవల ఓ టీవీ ఛానల్ ద్వారా తెలుసుకుని వచ్చానని వివరించారు.
విదేశాల్లో వ్యాపారాలు.. సామాజిక సేవ
భారత్, అమెరికా, గల్ఫ్ దేశాల్లో తనకు నగల వ్యాపారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంటానని బాబీ చెమ్మనూర్ తెలిపారు. ‘డొనేట్ బ్లడ్.. సేవ్ లైఫ్' నినాదంతో 812 కిలోమీటర్ల పరుగు చేశానని చెప్పుకొచ్చారు. కేరళలో మానసిక రోగులకు ఆశ్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు. తన చిరకాల కోరికను తీర్చిన సంగారెడ్డి జైలు అధికారులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.