ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
హైదరాబాద్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కసరత్తులు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిన బీజేపీ నేతలు.. చేరికల విషయలో మరింత జోరు పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలో చేరికల బాధ్యతలను కీలక నేతలకు అప్పగించేందుకు సిద్ధమైంది.
ప్రస్తుతం పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్గా ఇంద్రసేనా రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి తనను తప్పించాలని ఆయన ఇప్పటికే కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆయన స్థానంలో చేరికల కమిటీ బాధ్యతలను కొత్తగా పార్టీలో చేరిన సీనియర్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్, కో-ఛైర్మన్ గా వివేక్ వెంకటస్వామికి అప్పగించాలనే యోచనలో బీజేపీ నేతలు ఉన్నట్లు సమాచారం.

టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేయడంతోపాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈటల రాజేందర్ కు ఈ బాధ్యతలు అప్పగిస్తే.. పార్టీలో చేరికలు ఎక్కువగా ఉంటాయని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం బండి సంజయ్ అధ్యక్షతన పార్టీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీల భేటీ జరగనుంది.
పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభపై, మొత్తం 119 నియోజకవర్గాల్లో జరిగిన సంపర్క్ యోజనపై ఇందులో సమీక్షించనున్నారు. అంతేగాక, పార్లమెంటు ప్రవాస్ యోజన తయారీపై చర్చతో పాటు భవిష్యత్ కార్యక్రమాలపై కసరత్తు చేయనున్నట్లు సమాచారం. జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడే జరగడం, విజయసంకల్ప సభ విజయవంతం కావడంతో తెలంగాణ బీజేపీ నేతలు ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
బీజేపీ బలోపేతానికి మూడు కమిటీలు
తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతానికి బండి సంజయ్ మూడు కమిటీలను ప్రకటించారు. నేతల చేరికలపై సమన్వయ కమిటీ, ఫైనాన్స్ కమిటీ, ప్రజా సమస్యలు-టీఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. సమన్వయ కన్వీనర్గా బీజేపీ జాతీయ కార్యకర్గసభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను నియమించారు. ఈ కమిటీలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాజ్యసభసభ్యుడు డాక్టర్ లక్ష్మన్, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావు, ఏ చంద్రశేఖర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ ఉన్నారు.
ఫైనాన్స్ కమిటీ కన్వీనర్గా జితేందర్ రెడ్డిని ఎంపిక చేశారు. సభ్యులుగా గరికపాటి మోహన్ రావు, చాడ సురేష్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, శాంతికుమార్, యోగానంద్ ఉన్నారు. ఇక ప్రజా సమస్యలు-టీఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యక్షన కమిటీ కన్వీనర్గా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను ప్రకటించారు. ఇందులో సభ్యులుగా వివేక్ వెంకటస్వామి, రఘునందన్ రావు, స్వామిగౌడ్, డా. ప్రకాశ్ రెడ్డి, బాజీ అజ్మీరా ఉన్నారు.












Click it and Unblock the Notifications