"హైడ్రా విషయంలో అవసరమైతే జైలుకెళ్తా.. నాపై 173 కేసులు ఉన్నాయి"
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. పోతే జైలుకు పోతానని .. తనపై 173 కేసులు ఉన్నాయన్నారు. తన ఇంట్లో వైఎస్సార్,కేసీఆర్ ఫొటోలు ఉన్నాయని.. ఇంట్లో వైఎస్సార్, కేసీఆర్ ఫొటోలు ఉంటే తప్పేంటి? అని ప్రశ్నించారు. నాయకుల విషయంలో ఎవరి అభిమానం వాళ్లది అని దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఖైరతాబాద్ లో హైడ్రా అడుగు పెడితే ఊరుకోనని మరోసారి హెచ్చరించారు.
" నేను పోలీసులతో, హైడ్రా విషయంలో తగ్గే ప్రసక్తే లేదు. మా ఏరియాకు వస్తే ఊరుకునేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు చెప్పిన. పేదల ఇండ్లు కూలుస్తాం అంటే ఊరుకోను. అవసరమైతే జైలుకు పోతా కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. నా ఇంట్లో వైఎస్సార్, కేసీఆర్ ఫొటోలు ఉన్నాయి.సీఎం రేవంత్ రెడ్డి ఫొటో ఇంకా రాలేదు." అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దానం. ఇప్పటికే చింతల్ బస్తీ కూల్చివేతల సమయంలో దానం వ్యవహరించిన తీరుపై పరిశీలిస్తామని పార్టీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. తాజాగా ఆయన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి.

అయితే ఇటీవల ఆపరేషన్ రోప్ లో భాగంగా ఖైరతాబాద్ లోని చింతల్ బస్తీలో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించి కూల్చివేత చేపట్టారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న దానం నాగేందర్ అధికారులపై విరుచుకు పడ్డారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచి ఇక్కడ బతకడానికి వచ్చి.. ఇక్కడే ఉన్న మిమ్మల్ని బతకనివ్వరా..? అని ప్రశ్నించారు. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
అయితే అధికారపార్టీలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దానం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications