సీఎం జగన్ తో మాజీ ఎంపీ భేటీ వెనుక - సాయిరెడ్డి సీటు పై కన్ను: ఏ హామీ దక్కింది..!!
ఏపీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత జగన్ తో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి భేటీ అయ్యారు. ఇప్పుడు ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చకు కారణమైంది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ తరపున పొంగులేటి పోటీచేసి ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో తెలంగాణలో ఒక ఎంపీతో పాటుగా వైసీపీ గెలిచిన నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. ఆ గెలుపులో పొంగులేటి కీలక పాత్ర పోషించారు.
టీఆర్ఎస్ లో ఆశించినా...
ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి గులాబీ కండువా కప్పుకున్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కోసం పని చేసారు. అయితే, ఆ తరువాత 2019 ఎన్నికల్లో పొంగులేటి కాకుండా... టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వరరావును టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్ధిగా ఎంపిక చేయగా..ఆయన ఆ ఎన్నికల్లో గెలుపొందారు.
ఆ సమయంలో భవిష్యత్ లో తగిన అవకాశం కల్పిస్తామంటూ సీఎం కేసీఆర్ నుంచి హామీ లభించింది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో పొంగులేటికి అవకాశం ఇస్తారని ప్రచారం సాగింది. కానీ, ఖమ్మం జిల్లా నుంచి సీనీయర్ నాయకుడు తాతా మధుకు కేసీఆర్ ఇచ్చారు. దీంతో మరోసారి పొంగులేటి నిరాశ చెందారు.
తిరిగి జగన్ పైనే నమ్మకం
ఇక, తనకు టీఆర్ఎస్ లో ఏ పదవి ఇప్పట్లో దక్కదనే అభిప్రాయానికి పొంగులేటి వచ్చినట్లుగా మద్దతు దారులు చెబుతున్నారు. ఇక, ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఇందు కోసం పొంగులేటితో చర్చలు సైతం జరిగాయి. పొంగులేటికి ఉన్న వ్యక్తిగత మద్దతు ద్వారా మరింతగా బలం పెంచుకోవచ్చని కమల నాధులు అంచనా వేసారు.
ఇదే సమయంలో పొంగులేటి షర్మిల పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారనే చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో సాగింది. పదవిలో లేనప్పటికీ తన కేడర్ను ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలో ఆయన అమరావతికి వచ్చి ఏపీ మఖ్యమంత్రితో సమావేశమయ్యారు. మరి కొద్ది నెలల్లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి.
రాజ్యసభ సీటు ఆశించారా
తనకు వైసీపీ నుంచి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని పొంగులేటి ఏపీ సీఎంను కోరినట్లుగా విశ్వసనీయ సమాచారం. జగన్ ఓదార్పు యాత్ర.. 2014 ఎన్నికల ప్రచారం సమయంలోనూ పొంగులేటి కీలకంగా వ్యవహరించారు. జగన్ కు మద్దతుగా నిలిచారు. అయితే, రాజ్యసభకు పోటీ ఎక్కువగా ఉందని.. సామాజిక సమీకరణాల్లో భాగంగా అభ్యర్ధుల ఎంపికకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.
అందునా ప్రస్తుతం పదవీ విరమణ చేయనున్న నలుగురిలో విజయ సాయిరెడ్డి సైతం ఉన్నారు. అయితే, ఢిల్లీలో కేంద్రం - ఏపీ మధ్య సంధానకర్త పాత్ర పోషిస్తున్న విజయ సాయిరెడ్డికి తిరిగి రాజ్యసభ రెన్యూవల్ ఖాయమని చెబుతున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస రెడ్డికి అవకాశం దక్కటం సాధ్యపడదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
రాజ్యసభ సీట్లు ఖరారయ్యాయా
అయితే, సాయిరెడ్డిని ఏదైనా కారణాలతో వచ్చే ఎన్నికల కోసం సీఎం జగన్ రాష్ట్ర స్థాయిలో వినియోగించాలని భావిస్తే ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీలో హోదా కొనసాగించే ఛాన్స్ లేకపోలేదనే డిస్కషన్ వినిపిస్తోంది. అదే జరిగితే.. ఆ స్థానంలో రెడ్డి వర్గానికి చెందిన వారికి కొత్త వారికి అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది. ఆ కోణంలోనే శ్రీనివాస రెడ్డి అమరావతికి వచ్చి జగన్ తో సమావేశమయ్యారనే ప్రచారం ఖమ్మం పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. అయితే, సీఎం జగన్ ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఆసక్తి కరంగా మారుతోంది.