ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ మృతి.. కార్మికులు గరం గరం.. 14 నాడు జిల్లా బంద్
ఖమ్మం : ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా మారుతోంది. జిల్లాకు చెందిన కార్మికులు పోరుబాటకు సై అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో శనివారం నాడు ఆత్మహత్యకు ప్రయత్నించిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు ప్రాణాలు విడిచారు. దాంతో కంచన్బాగ్లోని డీఆర్డీవో అపోలో ఆసుపత్రి దగ్గర టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఆయా పార్టీల నేతలు హాస్పిటల్కు చేరుకోవడంతో ఎప్పుడేమి జరుగుతుందోననే సిట్యువేషన్ ఏర్పడింది. శ్రీనివాస్ రెడ్డి మృతి నేపథ్యంలో 14వ తేదీ సోమవారం నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్కు పిలుపునిచ్చారు అఖిల పక్షం నేతలు.
ప్రాణాలు విడిచిన ఖమ్మం డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి
ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమవుతోంది. బెట్టు వీడని కార్మికులు.. మెట్టు దిగని ప్రభుత్వం తీరుతో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఖమ్మం డిపో డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం నాడు ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు, తోటి కార్మికులు అతడిని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం శనివారం నాడే శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ కంచన్ బాగ్లోని డీఆర్డీవో అపోలో హాస్పిటల్కు తీసుకెళ్లారు.
50 శాతం ఓట్లు మాకేనంటూ.. టీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ.. కేటీఆర్ ఫుల్ ఖుషీయా?
ఆసుపత్రి దగ్గర కార్మికుల ఆందోళన.. టెన్షన్ వాతావరణం
ప్రభుత్వ వైఖరికి నిరసనగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు మరణించారు. దాంతో హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఆ మేరకు పోలీసులు అలర్టయ్యారు. శ్రీనివాస్ రెడ్డి మృతితో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో విషయం తెలిసి వివిధ రాజకీయ పార్టీ ల నేతలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు.. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడా వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తదితరులు హాస్పిటల్కు వచ్చారు.
సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్
శ్రీనివాస్ రెడ్డి సూసైడ్తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఆదివారం నాడు బస్సుల బంద్కు పిలుపునిచ్చారు. ఆ క్రమంలో ఉదయం నుంచే ఆయా డిపోల దగ్గర కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఖమ్మంతో పాటు మరో ఆరు డిపోల్లో బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. వీరి ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు వామపక్షాలు కూడా మద్దతుగా నిలిచాయి. అదలావుంటే శ్రీనివాస్ రెడ్డి చనిపోయాడనే విషయం తెలిసి సోమవారం (14.10.2019) నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్కు పిలుపునిచ్చారు అఖిల పక్షం నేతలు.
టికెట్ టికెట్.. ఆర్టీసీ బస్సుల్లో దోపిడీకి చెక్.. అవి వచ్చేస్తున్నాయట..!
నోటికి నల్ల బ్యాడ్జీలు.. మౌన ప్రదర్శన.. పలు డిపోల్లో కార్మికుల నిరసన
ఆర్టీసీ సమ్మె ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో వివిధ డిపోల్లో ఆదివారం నాడు నోటికి నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు కార్మికులు. వైరాలో అఖిల పక్షం ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించిన కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. మణుగూరు డిపోకు చెందిన కార్మికులు కూడా నోటికి నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శనగా ర్యాలీ చేపట్టారు. సీఎం కేసీఆర్ కార్మికుల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు.