మజ్లీస్తో కనుసన్నల్లో తెరాస, కెసిఆర్ మాటలతో తేలిపోయింది: కిషన్ రెడ్డి
హైదరాబాద్: మజ్లీస్ పార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ కుమ్మక్కయిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం కనుసన్నలలో టీఆర్ఎస్ పార్టీ నడుస్తోందని, నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాటలతో ఈ విషయం తేలిపోయిందని ఆయన అన్నారు.
అయితే గతంలో ఎంఐఎం చేసిన దాడులను కేసీఆర్ సమర్దిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎంఐఎంతో టీఆర్ఎస్ దోస్తీ పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీయదా? అని ఆయన ప్రశ్నించారు.
జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడిన అక్బరుద్దీన్పై రెండేళ్లయినా ఎందుకు ఛార్జ్షీట్ వేయలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎంలను గెలిపిస్తే గ్రేటర్ ప్రజలకు మిగిలేవి ముల్లెనని, గ్రేటర్లో బీజేపీ, టీడీపీలే అతి పెద్ద పార్టీలన్నారు. అలాగే టీఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకుందని కిషన్రెడ్డి అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు గెలిస్తే శాంతిభద్రతలకు ప్రమాదకరమని కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము గెలవడం లేదని సీఎం కేసీఆరే అంగీకరించడం సంతోషకరమన్నారు.
గ్రేటర్లో సింగిల్ పార్టీగా బీజేపీ-టీడీపీ గెలవబోతోందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రెండేళ్లలో పది వేల పైచిలుకు కట్టించి ఉండొచ్చని, అయితే ఎందుకు కట్టలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు.
లక్ష ఇళ్లు ఎలా కడతారో కూడా చెప్పాలన్నారు. లక్ష ఇళ్లు కట్టడానికి రూ. 7లక్షల కోట్లు కావాలని, ఈ నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా ఏదీ సాధ్యం కాదన్నారు.