కాంగ్రెస్ నేతలకి ఇప్పుడర్థమైంది, అసద్ని అరెస్ట్ చేయాలి: కిషన్, అక్బర్ హల్చల్
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ రౌడీయిజం గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇప్పుడు అర్థమవుతోందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, అంబర్ పేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి మంగళవారం అన్నారు. పాతబస్తీలో మజ్లిస్ పార్టీ చేసిన దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
సాయంత్రం కిషన్ రెడ్డి మాట్లాడారు. బిజెపి వాళ్ల పైన మజ్లిస్ గతంలో ఎన్నోసార్లు దాడులు చేసిందన్నారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో బిజెపి కార్యకర్తల పైన అధికార పార్టీ కార్యకర్తలు, మజ్లిస్ కార్యకర్తలు దాడులు చేశారని ఆరోపించారు. అసదుద్దీన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి పరిస్థితి గతంలోనూ జరగలేదన్నారు. అనేక డివిజన్లలో బిజెపి అభ్యర్థులను కార్యకర్తలను మజ్లిస్ కార్యకర్తలు కొట్టినట్టు తెలిపారు. మజ్లిస్ను పెంచి పోషించిన కాంగ్రెస్ నేతలపై కూడా మజ్లిస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఆయన ప్రస్తావించారు.
కొత్త నగరంలో అధికార పార్టీ, పాతనగరంలో మజ్లిస్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. పోలీసులు తెరాస కార్యకర్తల్లా వ్యవహరించారన్నారు. మజ్లిస్ పార్టీతో దోస్తీ పులిమీద స్వారీ అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అర్థమైందన్నారు. బిజెపి జంగమ్మెట్ అభ్యర్థి, ఆయన భార్య పైన మజ్లిస్ దాడి చేసిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... ఈ దాడి పైన విచారణ జరిపించాలన్నారు. పాతబస్తీలో ప్రజాస్వామ్యం లేదని చెప్పేందుకు ఇది నిదర్శనమన్నారు. టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... మజ్లిస్ నేతలు సియాసత్ ఎడిటర్ను కొట్టారని, అతను ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారన్నారు. తాము డిజిపి కార్యాలయం ముందు ఆందోళన చేస్తామన్నారు.
ఓటమి భయంతోనే మజ్లిస్ దాడి: అజం ఆలీ
పాతబస్తీలోని అజంపురలో ఉన్న ఉప ముఖ్యమంత్రి సీఎం మహమూద్ ఆలీ నివాసంపై ఎమ్మెల్యే బలాలతో కలిసి వచ్చిన మజ్లిస్ కార్యకర్తలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మహమూద్ ఆలీ కుమారుడు అజం ఆలీ గాయపడ్డారు. అనంతరం అజం ఆలీ మీడియాతో మాట్లాడారు.
ఓటమి భయంతోనే మజ్లిస్ దాడులకు పాల్పడుతోందన్నారు. మజ్లిస్ భయపెడితే తాము భయపడబోమన్నారు. మజ్లిస్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. దాడి సమాచారం తెలిసిన వెంటనే హోం మంత్రి నాయిని నర్సింహ రెడ్డి పాతబస్తీకి వెళ్లారు. మహమూద్ ఆలీ నివాసానికి వెళ్లి మహమూద్ ఆలీని, అజం ఆలీని పరామర్శించారు.
డిజిపి కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నా
డిజిపి కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ సాయంత్రం ధర్నాకు దిగింది. పాతబస్తీలో మజ్లిస్ పార్టీ దాడిని నిరసిస్తూ వారు ఆందోళనకు దిగారు. వెంటనే తమ పైన దాడికి పాల్పడ్డ మజ్లిస్ కార్యకర్తలను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఫలక్నుమాలో అక్బరుద్దీన్ హల్చల్
ఫలక్ నుమా ప్రాంతంలో అక్బరుద్దీన్ హల్చల్ చేశారని తెలుస్తోంది. తమ పార్టీ అభ్యర్థి పైన ఆయన దాడి చేశారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. స్థానికంగా భారీ ఎత్తున మజ్లిస్, బిజెపి కార్యకర్తలు గుమికూడారు. మరోవైపు, పాతబస్తీలో దాడి ఘటన పైన పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, షబ్బీర్ అలీ 24 గంటలు సమయం ఇచ్చారు. ఆ లోగా చర్యలు తీసుకోవాలన్నారు.