తెరాసను ఎండగట్టడంలో విఫలమయ్యాం: గ్రేటర్ ఫలితాలపై కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను ఎండగట్టడంలో తాము విఫలమయ్యామని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తెరాస గెలవకపోతే హైదరాబాద్లో అభివృద్ధి ఆగిపోతుందని ప్రజలను నమ్మించారని ఆయన అన్నారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కూడా తెరాస ఫలితం సాధించిందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో తెరాస కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందని, మజ్లీస్తో చేతులు కలిపిందని ఆయన విమర్శించారు సంక్షేమ, అభివృద్ధి పథకాలు హైదరాబాదులో కొనసాగాలని ప్రజలు తెరాసకు ఓటేశారని ఆయన చెప్పారు.
తెరాసకు 14 లక్షల ఓట్లు వస్తే, బిజెపి - టిడిపి కూటమికి 7 లక్షల ఓట్లు వచ్చాయని ఆయన చెప్పారు. నాలుగు సీట్లతో తాము గౌరవస్థానంలో నిలిచామని ఆయన చెప్పారు. తెరాస, మజ్లీస్ తర్వాత బల్దియాలో మూడో అతి పెద్ద పార్టీ తమదేనని, ప్రతిపక్షంగా హైదరాబాదులో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం పట్టుబడుతామని ఆయన చెప్పారు.
గెలిచిన స్థానాలతో నిమిత్తం లేకుండా హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వంతో తాము సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున నిలబడి పనిచేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. బల్దియాలో మంచిపాలన అందించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటామని ఆయన చెప్పారు. రాజకీయాల్లో ఓటమి సహజమని, దాన్ని విశ్లేషించుకని ఎలా ముందుకు సాగాలో చూసుకుంటామని ఆయన చెప్పారు.