తెలంగాణలో కైటెక్స్, సింటెక్స్ భారీ పెట్టుబడులు: యూనిట్లకు శంకుస్థాపన, 18 వేల మందికి ఉపాధి
హైదరాబాద్: తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంలా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని సీతారామపురం, చందన్ వెల్లి పారిశ్రామికవాడల్లో రూ. 1400 కోట్లతో నిర్మించనున్న కైటెక్స్, రూ. 350 కోట్లతో స్థాపించనున్న సింటెక్స్ సంస్థల తయారీ యూనిట్లకు గురువారం నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమాల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ సమీపంలోని షాబాద్ మండలం లాజిస్టిక్ రంగానికి చిరునామాగా మారుతోందన్నారు. వెల్స్పన్ గ్రూప్ తన మూడో యూనిట్ సింటెక్స్ పైపులు, ట్యాంకుల పరిశ్రమను వచ్చే 9 నెలల్లో పూర్తి చేసి వెయ్యి మందికి ఉపాధి కల్పించనుందని తెలిపారు. గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా మరో ప్రపంచ దిగ్గజ కైటెక్స్.. అసెంబ్లింగ్ గార్మెంట్స్, అపెరల్స్ యూనియన్ను సీతారాంపురం పారిశ్రామికవాడలో ఏర్పాటు చేస్తోందన్నారు.

2024 నాటికి ఈ కేంద్రంలోకి వస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ప్రతిరోజూ 7 లక్షల దుస్తులను ఉత్పత్తి చేయనుందన్నారు. ఈ సంస్థ ద్వారా 18 వేల మందికి ఉపాధి లభించనుందని, ఇందులో 80 శాతం ఉద్యోగాలు మహిళలకేనని చెప్పారు. వెల్స్పన్ గ్రూప్ ఐదేళ్లలో రూ. 5వేల కోట్ల పెట్టుబడితో చందన్వెల్లిలో లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుందని కేటీఆర్ వివరించారు.
చందన్వెల్లిలో తయారవుతున్న వెల్స్పన్ సంస్థ సిలికాన్ వ్యాలీ వరకు చేరి అక్కడ మేడిన్ చందన్వెల్లి, మేడిన్ తెలంగాణగా పేరొందాయని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్న సంస్థల్లో 26 శాతం సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. వెల్స్పన్ సంస్థ ఛైర్మన్ బీకే గోయెంకా కోరిక మేరకు ఈ ప్రాంతానికి రహదారుల విస్తరణ చేపడతామని తెలిపారు.
'వచ్చే ఐదేళ్లలో చందన్వెల్లిలో మరో వెల్స్పన్ నగరాన్ని నిర్మిస్తాం. ఇందులో పూర్తిస్థాయి ఫ్లోరింగ్, అత్యాధునిక టెక్స్టైల్స్, ప్లాస్టిక్ ఉత్పత్తులతోపాటు భవన నిర్మాణానికి అవసరమైన ప్రతి ఒక్కటీ లభిస్తుంది. మా కంపెనీ ఇప్పటికే 500 మందికి ఇక్కడ ఉద్యోగాలిచ్చింది. చందన్వెల్లి చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిలో నాణ్యమైన విద్యాసంస్థలున్నాయి. ఇక్కడ అత్యాధునిక నైపుణ్యాలున్న కొత్త మానవ వనరులకు కొదవలేదు. చందన్వెల్లికి 45 నిమిషాల ప్రయాణ దూరంలోనే రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. ఒక గంట ప్రయాణ దూరంలోనే హైదరాబాద్ ఉంది. దీంతో ఇక్కడి యూనిట్ మాకు అతిపెద్ద బ్యాక్ ఆఫీస్ కాబోతోంది. వచ్చే ఏడేండ్లలో 50 వేలమందికి ఉద్యోగాలిస్తాం. భవిష్యత్తులో చందన్వెల్లి పరిశ్రమలకు స్వర్గధామం అవుతుంది' అని మంత్రి కేటీఆర్ వివరించారు.












Click it and Unblock the Notifications