'కెకె నాడు పులి టిఆర్ఎస్లో పిల్లిలా మారారు, డబ్బులు తీస్కున్న డిఎస్'
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలరు చేశారు. పులిలాంటి కె కేశవ రావు టీఆర్ఎస్ పార్టీలో చేరాక పిల్లిలా మారిపోయారని ఎద్దేవా చేశారు. గాంధీ భవన్లో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. డి శ్రీనివాస్ తమ పార్టీలో ఉన్నప్పుడు డబ్బులు తీసుకొని బీఫాంలు ఇచ్చారని షబ్బీర్ అలీ ఆరోపించారు. పదవి లేకున్నా తాము పార్టీలోనే ఉంటామని చెప్పారు. పార్టీ కోసమే పని చేస్తామని చెప్పారు.
పదవులు లేకున్నప్పటికీ జెండాలు మోస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరినీ అభినందించాలని ఆయన అన్నారు. తనను కాంగ్రెస్ పార్టీ ముప్పై ఏళ్లకే మంత్రిగా చేసిందని చెప్పారు. మా కుటుంబం మొత్తం పార్టీ కోసం పని చేస్తుందని చెప్పారు.
కష్టకాలంలో కలిసి పని చేయాలి
ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. అందరు కూడా కలిసి కట్టుగా పని చేయాలన్నారు. పార్టీ కోసం పని చేస్తున్న వారిని గుర్తించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీగా పని చేస్తున్న వారు వెనుకబడుతున్నారన్నారు.