బాధపడిన కోదండరాం, తెలియదని కేసీఆర్పై ఆసక్తికర వ్యాఖ్య
మెదక్: మల్లన్న సాగర్ ముంపు బాధితుల పైన పోలీసుల లాఠీఛార్జ్ అమానుషమని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరామ్ సోమవారం అన్నారు. ముంపు గ్రామాల్లో పోలీసులను మోహరించడం సరికాదన్నారు. తక్షణమే వారిని ఉపసంహరించుకోవాలన్నారు.
లాఠీఛార్జ్ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న వారిని అరెస్టు చేయడం సరికాదని కోదండ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు.
అంతకుముందు, కోదండరాం ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్, తాను చాలా సన్నిహితంగా ఉండేవారమని, ఇప్పుడు అడిగినా కనీసం అపాయింటుమెంట్ కూడా ఎందుకు ఇవ్వడం లేదో తెలియదన్నారు.
కేసీఆర్ పైన కోదండరాం
ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాము పోరాడుతున్నామని చెప్పారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని, ఏదైనా చట్ట ప్రకారం, సమగ్రంగా ఉండాలని కోదండ హితవు పలికారు. తాము ఏ పక్షానికి లబ్ధి చేకూర్చాలనుకోవడం లేదన్నారు.
కోదండ వ్యాఖ్య ఎవరిని ఉద్దేశించి
తాను పదవులను ఆశించి పని చేయడం లేదని కోదండ చెప్పారు. పదవుల కోసం పని చేయడానికి వేరే వాళ్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. తద్వారా ఆయన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అనే చర్చ సాగుతోంది. ఇప్పుడైనా, 2019లో అయినా తాను ప్రజా సమస్యల పైన పోరాడుతానని చెప్పారు.
కోదండ
తాను చెప్పినట్లు, తనకు నచ్చినట్లు ప్రభుత్వం ఉండాలని తాను చెప్పడం లేదని, ప్రజలకు అనుగుణంగా నడుచుకోవాలని కోదండరాం చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రైతులు ఆత్మహత్య చేసుకోని రోజు లేదన్నారు. ప్రజల తరఫున నిజాయితీగా పోరాడేందుకు ధైర్యం అసరం లేదని, నిజాయితీ ఉంటే చాలునని చెప్పారు.
కోదండరాం
మీకు పాలన చేతకాకుంటే తప్పుకోండి అని తాను గతంలో అన్నట్లుగా వార్తలు వచ్చాయని, కాని తాను అలా అనలేదని చెప్పారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల కన్నీళ్లు చూస్తే కడుపు తరుక్కుపోతోందన్నారు. ఓ సమయంలో తన పైన మంత్రులు మాటల దాడి చేసినప్పుడు బాధపడ్డానని చెప్పారు. జేఏసీ ఉందా అని ప్రశ్నించే వాళ్లు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఎవరో రెచ్చగొడితే ప్రజలు ఉద్యమిస్తారనే భావన నుంచి బయటపడాలన్నారు.