ప్రజలే గుర్తింపు ఇచ్చారు: మంత్రుల వ్యాఖ్యలకు కోదండరామ్ కౌంటర్
అదిలాబాద్ : తనపై తెలంగాణ మంత్రులు చేస్తున్న విమర్శలకు తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ జేఏసీకి ప్రజలే గుర్తింపు ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో తెలగాణ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, టీఆర్ఎస్ రెండేళ్ల పాలన అంశంపై సదస్సులో కోదండరాం మాట్లాడారు.
మంత్రులు, తెలంగా రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నేతలు తనపై చేసిన విమర్శలకు కోదండరాం పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ప్రజా సంఘాలతో కూడిన ఉద్యమ సంస్థ టీజేఏసీ అని, ఎవరి గుర్తింపు, పదవులు తమకు అవసరం లేదని ఆయన అన్నారు. తమ ముందు, వెనుక ప్రజలు మాత్రమే ఉన్నారని ఆయన చెప్పారు.
జయశంకర్ చూపిన బాటలో రాష్ట్ర అభివృద్ధికి పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం ఉద్యమిస్తామని కోదండరాం తెలిపారు. కోదండరాంపై మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అదిలాబాద్ జిల్లా జేఏసీ తీర్మానం చేసింది.

తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రజల సమస్యలు తీరడం లేదని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై జేఏసీ సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై, ప్రజా సమస్యలపై రేపు జరగనున్న జేఏసీ సమావేశంలో చర్చించి, ఓ నిర్ణయానికి రానున్నట్లు చెప్పారు.
సమావేశం తర్వాత ప్రభుత్వానికి తాము సమాధానం చెబుతామన్నారు. తాము 30 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడుతున్నామన్నారు. ఏ ఒక్కరి ఒత్తిడి మేరకో జేఏసీ పని చెయ్యదన్నారు. అభివృద్ధి అనే లక్ష్యాన్ని సాధించాలని తెలంగాణ కోసం పోరాడామని ఆ కల నెరవేరేవరకు ఉద్యమిస్తూనే ఉంటామన్నారు.
కోదండరామ్ను రాజకీయ జెఎసి చైర్మన్ను చేసిందెవరో గుర్తించాలని తెలంగాణ హోం శాఖ సహాయ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి ఎక్కడుందని మరో మంత్రి అడిగారు. రెండేళ్ల టిఆర్ఎస్ పాలనపై ఆసంతృప్తి వ్యక్తం చేసిన కోదండరామ్పై గత రెండు రోజులుగా మంత్రులు, టిఆర్ఎస్ నాయకులు విరుచుకుపడుతున్నారు.












Click it and Unblock the Notifications