కేసీఆర్కు ఆ రెండూ లేవు: కోదండరాం, మునుగోడులో పోటీ చేస్తామంటూనే గద్దర్కు మద్దతు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న జాతీయ పార్టీపై తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శలు గుప్పించారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఒక విఫల ప్రయోగమని ఎద్దేవా చేశారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్కు ఆ రెండూ లేవు.. ఫ్యామిలీ కోసమేనంటూ కోదండరాం
జవహర్ లాల్ నెహ్రూ, అంబేద్కర్ లాంటి వారికి సిద్దాంతం ఉంది కాబట్టే.. ఆర్థిక నమూనా తయారు చేశారన్నారు. కేసీఆర్కు ఆ రెండూ లేవన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జాతీయ పార్టీ పేరుతో కేసీఆర్ నాటకాలు అడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ తక్షణ రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఆలోచిస్తారన్నారు. కుటుంబ ఆర్థిక అవసరాల కోసం కేసీఆర్ అధికారాన్ని వాడుకుంటున్నారని కోదండరాం ఆరోపించారు.

కేసీఆర్ జాతీయ పార్టీ ఓ విఫల ప్రయోగమన్న కోదండరాం
కేసీఆర్ జాతీయ పార్టీ ఓ విఫల ప్రయోగమని.. తెలంగాణ అస్థిత్వాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ స్థాయిలో తెలంగాణ మోడల్ డొల్లతనాన్ని బయటపెడతామని కోదండరాం హెచ్చరించారు. హైదరాబాద్, ఢిల్లీలో సదస్సులు పెట్టి.. బీఆర్ఎస్, తెలంగాణ మోడల్ కుట్రలను బహిర్గతం చేస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నప్పుడు ఆస్తులు పెంచుకునేందుకు సమయం ఎలా దొరికిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ప్రత్యేక మైన ఎజెండాతో ముందుకు రావాలని కోదండరాం అన్నారు.

మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేస్తామన్న కోదండరాం, కానీ..
త్వరలో జరిగే మునుగోడు ఉపఎన్నికలో టీజేఎస్ పోటీ చేస్తుందని కోదండరాం స్పష్టం చేశారు. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ ఉమ్మడి అభ్యర్థిగా తెలంగాణ సమాజం ఆయన వెంట ఉంటుందని, తాము కూడా మద్దతిస్తామన్నారు కోదండరాం. కాగా, బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications