మార్పు కోసమే జేఏసీ: కోదండరాం, కేసీఆర్కు ప్రశ్నలు, 22న నిరసన
ఎంతో మంది త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల బ్రతుకుల్లో మార్పు తీసుకురావడం కోసమే జేఏసీ ముందుండి పనిచేస్తుందని రాష్ట్ర జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
వరంగల్: ఎంతో మంది త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల బ్రతుకుల్లో మార్పు తీసుకురావడం కోసమే జేఏసీ ముందుండి పనిచేస్తుందని రాష్ట్ర జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఫిబ్రవరి 22న హైదరాబాద్లో తలపెట్టిన నిరుద్యోగుల నిరసన ర్యాలీ సన్నాహక కార్యక్రమంలో భాగంగా బుధవారం నర్సంపేటలో జేఏసీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులు, రైతులు పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కేవలం 5 వేల పైన ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, ఇందులో సాంకేతిక పరమైన ఉద్యోగాలు మాత్రమే నింపి విద్యావంతులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలేదని అన్నారు.
అసెంబ్లీలో లక్ష ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారే తప్ప నోటిఫికేషన్ వేయడంలేదన్నారు. రాష్ట్రంలో 12 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే కేవలం 5 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తిచేస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. జేఏసీ ప్రజా సమస్యలపై స్పందిస్తూ ముందుకు పోతుందన్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం అన్ని అంశాలలో కార్యాచరణ రూపొందించాలన్నారు. జేఏసీ ప్రదానంగా విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలతోపాటు రైతు సమస్యలు, కుల వృత్తుల అభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తుందన్నారు. జేఏసీ కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలన్నారు.
రాష్ట్రంలో పత్తి, మిర్చి, కూరగాయల విత్తనాలలో కల్తీ ఎక్కువగా ఉండటం వలన రైతులు తీవ్రంగా నష్టపోయారని అలాగే పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. రైతుల సమస్యలపై జేఏసీ తీవ్ర పోరాలు చేస్తుందన్నారు. భవిష్యత్లో ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 22న పలు డిమాండ్లతో నిరసన ర్యాలీ చేపడతామన్నారు.