కాంగ్రెస్ లోకి రాజగోపాల్ రీ ఎంట్రీ- అక్కడే ట్విస్ట్, ఓకే అయితే..!?
తెలంగాణ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ కీలక నేతల నిర్ణయాలు ఆసక్తిగా మారుతున్నాయి. వారి కోసం ప్రధాన పార్టీలు తమ అభ్యర్దుల ఖరారు పెండింగ్ లో పెడుతున్నాయి. ఇక, ఇప్పుడు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరటం ఖాయమైందనే ప్రచారం మొదలైంది. అయితే, ఆయన చేరికకు ఓకే చెబుతున్న కాంగ్రెస్ సీటు విషయంలో ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.
తిరిగి కాంగ్రెస్ గూటికి:బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్లోకి వచ్చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రేవంత్ టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసారు. బీజేపీలో చేరిన రాజగోపాల్ మునుగోడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత కొంత కాలం పార్టీలో యాక్టివ్ గానే ఉన్నా..తిరిగి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగింది. ఈటల రాజేందర్ తో కలిసి ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయిన తరువాత ఆ ప్రచారం ఆగింది. కానీ, బీజేపీ కీలక సమావేశాల్లోనూ రాజగోపాల్ రెడ్డి ఆసక్తి చూపలేదు. పలు సందర్భాల్లో గైర్హాజరయ్యారు. దీంతో..బీజేపీలో రాజగోపాల్ కొనసాగటం పైన సందేహాలు మొదలయ్యాయి.

సీటు పోటీపై చర్చ:ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి మునుగోడు లేదా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అవసరమైనే మునుగోడు నుంచి రాజగోపాల్ సతీమణి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. కానీ, పార్టీ నాయకత్వం నుంచి మాత్రం సీట్ల ఖరారు పైన స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఈ సమయంలోనే రాజగోపాల్ కు కాంగ్రెస్ నుంచి కొందరు ముఖ్యులు టచ్ లోకి వచ్చారని సమాచారం. తన అనుచర గణంలో రాజగోపాల్ మంతనాలు సాగిస్తున్నారని చెబుతున్నారు.
మునుగోడు సీటు కాంగ్రెస్ నుంచి ఇస్తే ఆ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వామపక్షాలతో పొత్తులో భాగంగా ఆ సీటును వారికి కేటాయించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరాలని.. లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి సీటు ఇస్తామని హామీ ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

అన్నీ అనుకూలిస్తే:అందుకు రాజగోపాల్ సిద్దంగా లేరని అనుచరవర్గం చెబుతోంది. మునుగోడు సీటు ఖరారు అయితే రాజగోపాల్ కాంగ్రెస్ లో చేరుతారని చెబుతున్నారు. కానీ, రాజగోపాల్ తాను కాంగ్రెస్ లో చేరాలంటే ముందుగా రేవంత్ రెడ్డి గతంలో తన పైన చేసిన వ్యాఖ్యలపైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ నాయకత్వం ఎన్నికల సమయంలో అందరూ కలిసికట్టుగా పని చేసుకోవాలని..
గతంలో జరిగినవి పట్టించుకోవద్దని చెబుతన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. దీంతో, అన్నీ అనుకూలిస్తే మంగళవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక, దీని పైన అధికారికంగా రాజగోపాల్ ఏం చెబుతారనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications