వరంగల్ లో కొండా దంపతులను ఓడించాలె..! గెలుపుగుర్రాలను రంగంలోకి దించాలె..! కేసీఆర్ ఆదేశాలు..!
హైదరాబాద్ : ముగిసింది. తెలంగాణ గులాబీ పార్టీలో ఓ ప్రహసనం ముగిసింది. గత మూడు వారాలుగా రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న కొండా సురేఖ దంపతుల ఎపిసోడ్ ముగిసింది. ఇప్పుడు కొండా సురేఖ కోరుకుంటున్న ఆ మూడు నియోజక వర్గాల్లో వారిని ఎలా ఓడించాలని అదికార గులాబీ పార్టీ వ్యూహాలు రచించాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ ఆపధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై తిరుగుబావుటా ఎగరేసిన సురేఖ దంపతులు అంతే వేగంగా పార్టీ మారిపోయారు. ఇప్పుడు గులాబీ బాస్ కు వీరిని వచ్చే ఎన్నికల్లో ఓడించి తీయని ప్రతీకారం తీర్చకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. అందుకోసం కొండ కుంటుంబం నిలబెట్టేందుకు గెలుపుగుర్రాల కోసం చంద్రశేఖర్ రావు అణ్వేషణ మొదలు పెట్టినట్టు ప్రగతి భవన్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
ఒక్కటే టిక్కెట్, పరకాలపై మరో షరతు: కొండా సురేఖకు కాంగ్రెస్ షరతు!
కొండ దంపతుల పార్టీ మార్పుతో వరంగల్ లో మారిన రాజకీయం..!
ఇక వరంగల్ లో కొండ ను ఢీ కొట్టాలంటే బలం కావాలి. అర్ధ, అంగ, రాజకీయ బలం ఉండాలి. అలాంటి వారిని రంగంలోకి దించాలి.మరి ఎవరిని దించితే ఇది సాధ్యమవుతుంది. ఒకటి, రెండు, మూడు.. ఇలా అనేక పేర్లు. గులాబీ అధిష్టానం సరైన అభ్యర్థి కోసం వరంగల్ జిల్లాను జల్లెడ పడుతోంది. మరోవైపు కొండ దంపతులు ఏకంగా ముఖ్యమంత్రి కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ను టార్గెట్ చేసుకోవడంతో ఇప్పుడు ఈ వ్యవహారం పార్టీకి ఎంతో సవాల్గా మారింది. ఓరుగల్లు జిల్లాలో తమకంటూ ప్రత్యేక ప్రాబల్యం ఉన్న కొండ దంపతులకు ఊహించని రీతిలో టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబీతాలో చెక్ పడింది. ఇది ఒక్కసారిగా జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసేలా మారింది.
కొండా దంతుల నియోజక వర్గాలపై ప్రత్యేక నజర్..!
గత ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి గెలుపొందిన కొండా సురేఖ అభ్యర్థిత్వాన్ని మొదటి జాబితాలో ఖరారు చేయకపోవడం కొండ దంపతులకు ఆగ్రహానికి కారణమైంది. దీంతో కొండ దంపతులు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ను టార్గెట్ చేశారు. కేటీఆర్ కావాలనే తమ సీటును పక్కకు పెట్టాడని బహిరంగంగా చెప్పారు. దీనికంతటికి మూలసూత్రధారి కేటీఆర్ అంటూ కడిగిపారేశారు. కాస్తో, కూస్తో తమకు హరీష్రావు అండగా ఉన్నారంటూ ప్రకటించారు. ఇక వరంగల్ జిల్లాలో మూడు ప్రాంతాల నుంచి పోటీ కొండ దంపతులతోపాటు తాము ముందు నుంచి చెబుతున్నట్లు తమ కుమార్తెను దించుతామని స్పష్టం చేశారు. అవసరమైన స్వతంత్ర అభ్యర్థులుగానైనా బరిలోకి తమ సత్తాను చూపుతామని తెగేసి చెప్పారు.
కొండా కుటుంబాన్ని ఓడించండి..! పార్టీ శ్రేణులకు గులాబీ బాస్ ఆదేశాలు..!
పరకాల, వరగంల్ తూర్పు, శాయంపేట స్థానాల్లో బరిలో నిలవడం ఖాయమంటూ సవాల్ విసిరారు.గత కొద్ది కాలంగా కొండ దంపతులు తమ కుమార్తెను రాజకీయ వారసురాలిగా ప్రకటించడమే కాకుండా 2019 ఎన్నికల్లో బరిలోకి దింపుతామని స్పష్టం చేశారు. ఈ తరుణంలోనే తెరాస అధినాయకత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. పార్టీలో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తామని ఇవ్వలేదని, ఈ కారణంగానైనా తమ కుమార్తెకు సైతం సీటు కేటాయించాలంటూ విన్నవించుకున్నారు. అయితే వీరి అభ్యర్థనను అధిష్టానం దాటవేస్తూ వచ్చింది. జిల్లాలో తమకంటూ సొంతబలం ఉన్న కొండ దంపతులను ఢీ కొట్టాలంటే నిజంగా బలమైన అభ్యర్థులు కావాల్సిందే. అయితే గత కొద్ది రోజులుగా వరంగల్ తూర్పు నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు తన సోదరుడి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం కొండ వ్యతిరేక శక్తులను కూడగట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్ నుండి పోటీ చేయడం కొండా వ్యూహాత్మకం..! అందుకే కేసీఆర్ కు ప్రతిష్టాత్మకం..!
ఇదిలా ఉండగా తాజా పరిణామాలతో గులాబీ అధిష్టానం అలర్ట్ ఐనట్టు తెలుస్తోంది. కొండ కుటుంబం పోటీచేసే మూడు స్థానాలపై దృష్టి సారించింది. వరంగల్ తూర్పు నుంచి మేయర్ నరేందర్ నన్నపనేని తోపాటు ఎంపీ పసునూరి దయాకర్,గుండు సుధారాణిల పేర్లను ఇప్పటికే పరిశీలనలోకి తీసుకొన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో నరేందర్ వైపు కొంత మొగ్గు చూపుతున్నా., గుండు సుధారణిని తీసుకోవడం వల్ల కొండ సురేఖ స్థానాన్ని భర్తీ చేయాలని ఆలోచిస్తున్నారు.మరోవైపు ఎర్రబెల్లి తన సోదరుడికి టిక్కెట్ కేటాయిస్తే గెలుపిస్తానంటూ అధిష్టానం వద్ద చెబుతున్నారు. పసునూరిని అభ్యర్థిగా పెడితే కొండ సురేఖను ఢీ కొనడం కష్టమని భావిస్తున్నారు.ఇక పరకాల సీటును ఇప్పటికే చల్లా ధర్మారెడ్డికి అప్పగించారు. భూపాలపల్లి మధుసూదనాచారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పటికి ఇప్పుడు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. కొండా కుటుంబ సభ్యులు స్వతంత్రంగా పోటీ చేయకుండా కాంగ్రెస్ తరుపున రంగంలోకి దిగుతున్నందున అదికార పార్టీకి మరింత ప్రతిష్టాత్మకం కానుంది.దీంతో హరీష్రావును రంగంలోకి దించి ఇక్కడ గెలుపును సొంతం చేసుకోవాలనే ఆలోచనలో చంద్రశేఖర్ రావు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కొండ కుటుంబం పై గులాబీల యుద్దం జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది.