వెంబడించిన పోలీసులు: బీదర్ ఆస్పత్రిలో.. కోఠి ఆస్పత్రిలో కిడ్నాపైన పాప
హైదరాబాద్: నగరంలోని కోఠి ఆస్పత్రిలో కిడ్నాపైన ఆరు రోజుల శిశువు.. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యక్షమైంది. కోఠి ఆస్పత్రిలో సోమవారం ఆ శిశువును ఓ మహిళ టీకా వేయిస్తానంటూ తీసుకెళ్లి తిరిగి రాలేదు. దీంతో శిశువు కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వేగంగా స్పందించిన పోలీసులు పాప కోసం ఏడు బృందాలతో గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా శిశువును కిడ్నాప్ చేసిన మహిళ.. శిశువును తీసుకుని బీదర్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో బీదర్ పోలీసులను అప్రమత్తం చేశారు. ఇక్కడ్నుంచి పలువురు పోలీసులను అక్కడకు పంపించారు.

కాగా, మంగళవారం మధ్యాహ్నం బీదర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ పాప ఆచూకీని బీదర్ పోలీసులు కనుగొన్నారు. మీడియాలో విస్తృత కథనాలు రావడంతో భయపడిపోయిన మహిళ.. ఆ శిశువును ఆస్పత్రిలో వదిలేసి వెళ్లినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బీదర్ ఆస్పత్రిలో ఆ పాపకు వైద్య అందిస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు ఆ శిశువును కోఠి ఆస్పత్రిలోని ఆమె తల్లికి అప్పగించనున్నారు.
బిడ్డ కనిపించకపోవడంతో తల్లడిల్లిన తల్లి
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ ప్రసూతి కోసం గతవారం కోఠి ప్రసూతి ఆసుపత్రికి వచ్చారు. ఆమె ఓ ఆడశిశువుకు జన్మనిచ్చారు. ఆమె కదల్లేని స్థితిలో ఆస్పత్రిలో ఉండటంతో.. ఇది గమనించిన పక్కనే ఉన్న ఓ గుర్తుతెలియని మహిళ.. శిశువుకు టీకా ఇప్పిస్తానటూ తీసుకెళ్లింది. ఎంతసేపటికీ ఆమె తన బిడ్డను తీసుకురాకపోవడంతో విజయ తల్లిడిల్లిపోయారు.












Click it and Unblock the Notifications