రంగంలోకి కేటీఆర్ - కీలకంగా హరీష్ : చివరి పోటీలో గెలిచేదెవరు..!!
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందుతోంది. ముఖ్యమంత్రి హోదాలోకే జాతీయ పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటనలకు సిద్దం అవుతున్నారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచే బీజేపీ ప్రభుత్వం పైన సమర శంఖం పూరించేందుకు సిద్దమవుతున్నారు. ఇదే సమయంలో మునుగోడు ఎన్నిక టీఆర్ఎస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. టీఆర్ఎస్ పేరుతో ఇదే చివరి పోటీ కానుంది. ఆ తరువాత వచ్చే ఎన్నికల్లో గులాబీ ఆర్మీ బీఆర్ఎస్ నుంచి పోటీకి దిగనుంది. దీంతో..మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. మునుగోడు బాధ్యతలు స్వీకరించారు.
మంత్రులంతా అక్కడే మకాం
ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశించిన విధంగా నియోజకవర్గం 86 యూనిట్లుగా విభజించి బాధ్యతలు కేటాయించారు. ఈ రోజు నుంచి మునుగోడులోనే నేతలు మొహరించనున్నారు. ప్రతి ఎంపీటీసీ పరిధిని ఒక మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల్లో ఎవరో ఒకరికి అప్పగించారు. ప్రతి మంత్రి, ఎమ్మెల్యే 30 మంది నేతల బృందంతో మునుగోడుకు వెళ్తున్నారు. ఈ బృంద సభ్యులకు ఒక్కో ఎంపీటీసీ పరిధిలోని 3 వేల మందిని విభజించి, 100 మందికి ఒకరు చొప్పున బాధ్యతలు కేటాయించారు. మంత్రి కేటీఆర్ మునుగోడు ఉప ఎన్నికపై తన బృందంతో గురువారం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పరిస్థితి, అక్కడ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కీలక మండలాల బాధ్యతలను మంత్రులు కేటీఆర్ - హరీష్ కు అప్పగించారు.
కేటీఆర్ - హరీష్ కు కీలకంగా
గట్టుప్పల్ బాధ్యతలు కేటీఆర్ - మర్రిగూడ ఇన్చార్జ్గా హరీశ్రావు బాధ్యతలు తీసుకున్నారు. గతంలో ఉప ఎన్నికల వేళ హరీష్ కీలక పాత్ర పోషించే వారు. కేటీఆర్ ప్రచారం నిర్వహించేవారు. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో కేటీఆర్ అంతా తానై పార్టీ గెలుపు తన భుజస్కందాల పైన వేసుకొనే వారు. కానీ, ఇప్పుడు ఇద్దరూ కలిసి మునుగోడులో పార్టీ గెలుపు కోసం రంగంలోకి దిగారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, మంత్రి శ్రీనివాస గౌడ్ కు బాధ్యతలు కేటాయించారు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు దారులు ఎక్కువగా ఎక్కడ ఉన్నారనే దాని పైన ఇప్పటికే క్షేత్ర స్థాయి నుంచి టీఆర్ఎస్ పూర్తి సమాచారం సేకరించింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతూ తీర్మానం చేసినా, కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించే వరకూ టీఆర్ఎస్ గానే కొనసాగనుంది.
బీఆర్ఎస్ ఏర్పాటు వేళ ప్రతిష్ఠాత్మకంగా
అందులో భాగంగా ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావటం..నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో టీఆర్ఎస్ పార్టీ పేరుతోనే ఈ ఉప ఎన్నికల్లో గులాబీ నేతలు పాల్గొంటున్నారు. అయితే, బీఆర్ఎస్ ప్రకటన తరువాత జరగుతున్న ఎన్నిక కావటంతో దేశ వ్యాప్తంగా ఈ ఫలితం పైన ఆసక్తి ఉంటుంది. సీఎం కేసీఆర్ ఇక్కడ గెలుపుతోనే దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. దీంతో..అటు బీజేపీ - కాంగ్రెస్ పార్టీలు సైతం ఇక్కడే కేసీఆర్ కు జలక్ ఇవ్వాలనే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో..తెలంగాణ కేబినెట్ మొత్తం మునుగోడు కేంద్రంగా మొహరించనుంది. ఈ ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీ కంటే ఇప్పుడు కేటీఆర్ - హరీష్ సమర్ధతకు పరీక్షగా మారుతోంది.