మీ తాత ఊరు విజయనగరం నుంచి పోటీ చెయ్: రేవంత్, అలా అనుకున్నా: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యల పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శుక్రవారం స్పందించారు. కెటిఆర్ వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు.
అయితే, కెటిఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆమోదం ఉందా చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని తెలుగు రాష్ట్ర సమితిగా మార్చుకోవడం మంచిదేనని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
అసలు మొదట తెరాసను హైదరాబాదులోని సీమాంధ్రులు నమ్మాలంటే తెలంగాణ భవన్ పేరును తెలుగు భవన్గా మార్చాలన్నారు. కెసిఆర్ లేదా ఆయన పార్టీ టిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయవచ్చునన్నారు. అవసరమైతే మీ తాత (కెటిఆర్) ఊరు వియనగరం నుంచైనా పోటీ చేయవచ్చునన్నారు.
శుక్రవారం ఓ సందర్భంలో కెటిఆర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సమితి అవసరమైతే ముందు ముందు తెలుగు రాష్ట్ర సమితిగా మారనుందని, తాను ఏపీలోని భీమవరం నుంచి పోటీ చేస్తానని సరదాగా అన్నారు. భీమవరం నుంచి పోటీ చేయడం చాలా సులభమని చెప్పారు. అందుకే నేను భీమవరంను ఎంచుకున్నానని చెప్పారు. కోడిపందేలను లీగలైజ్ చేస్తామని చెబితే చాలు అక్కడ గెలుస్తామన్నారు.
సమస్యను పరిష్కరించకుంటే నిరసన వ్యక్తం చేయండి: కెటిఆర్
సమస్యలు పరిష్కరించకపోతే నిరసన మార్గం ఎంచుకోవాలని, నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని మంత్రి కెటిఆర్ శుక్రవారం అన్నారు. ఆయన జర్నలిస్టులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
అధికారంలోకి రాకముందు ఇలా చెబితే అలా పనులు వసూలు అయిపోతాయనుకున్నామని, కానీ ఇప్పుడు చాలా ఇబ్బందులు పడవలసి వస్తోందన్నారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో 11వేల మంది జర్నలిస్టులకు బస్పాస్లు ఇస్తామన్నారు.