హైదరాబాద్లో క్లౌడ్ కంప్యూటింగ్ కౌన్సిల్ హెడ్ ఆఫీస్: కెటిఆర్తో క్రిస్ గోపాలకృష్ణన్
హైదరాబాద్: సిఐఐ క్లౌడ్ కంప్యూటింగ్, ఇన్నోవేషన్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు కౌన్సిల్ చైర్మన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె తారకరామారావుతో సమావేశమయ్యారు.
క్రిస్ ప్రతిపాదన పట్ల మంత్రి కెటిఆర్ పూర్తిగా సానుకూలంగా స్పందించారు. ఈ విషయమై త్వరలో ప్రభుత్వం తరఫున లాంఛనంగా ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. క్లౌడ్ కంప్యూటింగ్లో ఎకోసిస్టమ్ అమలుకు తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తామని క్రిస్ ప్రతిపాదించారు.
రాష్ట్రంలో ఏర్పాటుచేసే స్టార్టప్లకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. క్రిస్ ప్రతిపాదనల పట్ల మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా పాల్గొన్నారు.
హైదరాబాద్ స్మార్ట్ సిటీగా ఎంపికవ్వాలి: దత్తాత్రేయ
మంగళవారం నగరంలోని తాజ్కృష్ణ హోటల్లో విజన్ ఫర్ స్మార్ట్ హైదరాబాద్ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ స్మార్ట్సిటీ తుది జాబితాలో ఎంపికయ్యేలా చూడాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు.
ఈ సమావేశానికి కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్, సీఐఐ ప్రతినిధి వనితా దాట్ల, నిర్వాహకురాలు ఫ్యూచరిస్టిక్ సిటీస్ వ్యవస్థాపకురాలు కరుణా గోపాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి స్మార్ట్ సిటీల పథకం తీసుకొచ్చిందన్నారు. మొదట వంద నగరాలను ప్రతిపాదించిందని వాటి మధ్య వివిధ అంశాల్లో పోటీ నిర్వహించనున్నట్లు వివరించారు. ఆ పోటీలోనూ విజయం సాధించి హైదరాబాద్ స్మార్ట్ సిటీ హోదా పొందాలని దత్తాత్రేయ ఆకాంక్షించారు.