అన్నీ చెప్పమంటే ఎలా!: ఏపీలో జగన్ కోసం ప్రచారం చేస్తారా అంటే కేటీఆర్ ఏం చెప్పారంటే?
Recommended Video

హైదరాబాద్: 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. తమతో ఎన్నో రాజకీయ పార్టీలు చాలా సన్నిహితంగా ఉంటున్నాయని చెప్పారు. అదే సమయంలో ఆయన మాట్లాడుతూ జగన్కు మేలు జరగాలని ఆకాంక్షించారు.
ఇటీవల కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి వెళ్తామని, రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీకీ మద్దతుగా మీడియా కేటీఆర్ను ప్రశ్నించింది. తెరాస ఇంతవరకూ ప్రత్యేకించి ఏ ఒక్క పార్టీకీ దగ్గర కాలేదని చెప్పారు. పలు పార్టీలతో తాము స్నేహంగా ఉంటున్నామని చెప్పారు.

సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం
ఆంధ్రప్రదేశ్లో జగన్ చాలా గట్టి పోటీని ఇస్తున్నారని, ఆయనకు మేలు జరగాలని కోరుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం, పాలన పైన తాము దృష్టి సారించామని చెప్పారు. ఆ తర్వాత సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

16 సీట్లు గెలుస్తాం
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే రానున్న లోకసభ ఎన్నికల్లోను తాము పదహారు స్థానాలు గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లోనూ తమ పార్టీ అధినేత కేసీఆర్ కీలక పాత్ర పోషించబోతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్పై ఉన్న నమ్మకమే తమ పార్టీని గెలిపించిందని చెప్పారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను హైదరాబాద్ మజ్లిస్ గెలుచుకుంటుందని, మిగతా చోట్ల తాము గెలవడమే లక్ష్యమని చెప్పారు.

కేంద్రంలోను అదే జరుగుతుంది
జాతీయ పార్టీల అగ్రనేతలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మహా కూటమి, బీజేపీలకు ఓటమి తప్పలేదని కేటీఆర్ చెప్పారు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. కాంగ్రెస్ నేతలకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లోని ఈవీఎంలపై ఎందుకు అనుమానం రావట్లేదన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ప్రభుత్వం ఉందని, కేంద్రంలోనూ ఇదే జరుగుతుందన్నారు. లోకసభ ఎన్నికల తర్వాత తెలుగుదేశం ఉనికి గల్లంతవుతుందన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనా తెలంగాణలో తెరాసను అధికారానికి దూరం చేయలేకపోయాయని చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే తమకు ఓటు శాతం పెరిగిందన్నారు.

జగన్ తరఫున మీరు ప్రచారం చేస్తారా అని మీడియా అడగ్గా
కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ల ప్రమేయం లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎన్నో ప్రాంతీయ పార్టీల నేతలు కలసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు ఉంటే వారితో పోరాడుతామని, కానీ తమకు ఎవరితోను శత్రుత్వం లేదని చెప్పారు. రాజకీయ పక్షాలన్నింటిలో తమకు మిత్రులు ఉన్నారని, కేవలం ఒక పార్టీతో మాత్రమే స్నేహంగా ఉన్నామని చెప్పడం సరికాదని చెప్పారు. జగన్ ఏపీలో బాగా పోరాడుతున్నారని, వారు బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పారు. జగన్ తరఫున మీరు ప్రచారం చేస్తారా అని మీడియా కేటీఆర్ను ప్రశ్నించగా... ముందు ఇక్కడ (తెలంగాణ) సర్దుకోనివ్వండని, ఒకేసారి అన్ని విషయాలు చెప్పమంటే ఎలాగని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications