చంద్రబాబు పక్క రాష్ట్ర సీఎం, సీఎం రేసులో రేవంత్ రెడ్డి: కేటీఆర్, కార్యకర్తలకు వార్నింగ్
ఇబ్రహీంపట్నం: మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు మళ్లీ కన్నీళ్లే మిగులుతాయని తెలంగాణ మంత్రి (ఆపద్ధర్మ) కేటీ రామారావు మంగళవారం అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మహాకూటమిలో సీట్ల పంచాయతీ తెగడం లేదన్నారు. వారు సీట్లు పంచుకునేలోపు మనం సీట్లు పంచుకుంటామని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి కేడర్ లేదని, కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరని, వారిద్దరు కలిసి పొడిచేస్తాం, ఏదో చేస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మహాకూటమికి భయంకర పరాభవం తప్పదని అన్నారు.
Recommended Video
సర్వేలన్నీ టీఆర్ఎస్ వైపే, నువ్వు గెలుస్తున్నావ్.. లక్కీ, అదే జగన్ కొంపముంచింది: కేసీఆర్ జాగ్రత్తలు
అదే సమయంలో తెరాస నాయకులకు, కార్యకర్తలకు కూడా ఓ విధమైన వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు కేసీఆర్కు అనుకూలంగా ఉన్నారని, సర్పంచ్ ఎన్నికల్లో ఎలాగైతే ప్రజలను బతిమాలి ఓటింగ్ బూత్కు తీసుకు వస్తామో, అసెంబ్లీ ఎన్నికల్లోను అలాగే చేయాలన్నారు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు ఉంటాయని, అప్పుడు ఏ నాయకుడు పార్టీ కోసం పని చేశాడు, ఎవరు పని చేయలేదో తేలిపోతుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రం
చంద్రబాబు నాయుడు ఈ రోజు పక్క రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్) ముఖ్యమంత్రి అని కేటీఆర్ చెప్పారు. ఒకప్పుడు ఆయనకు తెలంగాణతో సంబంధం ఉందని, ఇప్పుడు సంబంధం లేదని చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన కేంద్రానికి ఎన్నో ఉత్తరాలు రాశారన్నారు. మనకు నీరు ఇచ్చే పాలమూరు ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టు అని చంద్రబాబు 30 లేఖలు రాశారని ఆరోపించారు.
కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు చేతిలో మహాకూటమి జుత్తు
పొరపాటున కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే ఆ జుత్తు చంద్రబాబు చేతిలో ఉంటుందని ఆరోపించారు. మహాకూటమి గెలిస్తే ఇబ్రహీంపట్నంకు నీరు వస్తుందా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తప్పుదారి మహాకూటమి గెలిస్తే మాత్రం ఆ జుత్తు ఆంధ్రా నాయకుడు చంద్రబాబు చేతిలో ఉంటుందని ఆరోపించారు.
చంద్రబాబు తెలంగాణను చంపుకుతిన్నారు
చంద్రబాబు నాయుడు ఏళ్లపాటు తెలంగాణను చంపుకుతిన్నారని, ఇప్పుడు మరోసారి ఆయన చేతిలో కాంగ్రెస్ తెలంగాణను పెట్టే ప్రయత్నాలు చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. చంద్రబాబు చేసే కుట్రలను మనం సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. 68 ఏళ్ల పాటు కాంగ్రెస్, టీడీపీలు పాలించాయని, కానీ ఏం చేయలేదన్నారు.
చంద్రబాబుతో ఎలా కలుస్తారు?
ఇబ్రహీంపట్నం నుంచి టీఆర్ఎస్ నేత ఎమ్మెల్యేగా గెలిస్తే, రాష్ట్రంలో తెలంగాణ అధికారంలోకి వస్తే నీరు వస్తుందని కేటీఆర్ చెప్పారు. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ నేత గెలిస్తే ఎమ్మెల్యే అవుతాడు.. ఇంకా పెద్దగా అవుతాడేమో అన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబుతో కాంగ్రెస్ ఎలా కలుస్తుందని ప్రశ్నించారు. కాలుష్యం పైన టీఆర్ఎస్కు ఉన్న అవగాహన, ఆందోళన కాంగ్రెస్ పార్టీకి ఉంటే పటాన్చెరు, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో తగ్గేదని కేటీఆర్ చెప్పారు. మహాకూటమికి పట్టం కడితే రైతుకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. వచ్చే రీజినల్ రింగు రోడ్డులో ఇబ్రహీంపట్నంకు మహర్దశ పడుతుందని చెప్పారు. వృద్ధులకు, మహిళలకు పింఛన్ మరింత పెంచారని చెప్పారు.
కూటమి అధికారంలోకి వస్తే రేవంత్ కూడా ముఖ్యమంత్రే
ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అని కేటీఆర్ ప్రశ్నించారు. జానారెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, జైపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి అందరూ ముఖ్యమంత్రులే అన్నారు. 60 నెలల్లో 60 మంది ముఖ్యమంత్రులుగా ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో 40 మంది సీఎం రేసులో ఉన్నారని చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్లో సీఎం కావాలన్నా, మంత్రి కావాలన్నా విమానం ఎక్కి ఢిల్లీకి వెళ్లాలని, అక్కడి నుంచి చీటి వస్తుందని, అందులో పేరు ఉంటుందని చెప్పారు. ఆత్మగౌరవం, స్వాభిమానం కోసం సాధించుకున్న తెలంగాణకు సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అవసరమా అని ప్రశ్నించారు.