ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్..!
తెలంగాణలో సంచలనం రేపిన ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకోబోతుంది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే.తారక రామారావు (కేటీఆర్) ఈరోజు (జూన్ 15) ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఉదయం 9 గంటలకు ఆయన తెలంగాణ భవన్కు చేరుకొని.. అక్కడి నుంచి 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఓ వైపు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హాజరవ్వగా.. కేటీఆర్ ఈ కార్ రేస్ కేసు విషయంలో విచారణకు హాజరు అవుతుండడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.
ఈ కేసులో మొదటిసారిగా ఈ ఏడాది జనవరి 9న కేటీఆర్ను ఏసీబీ అధికారులు సుమారు ఆరున్నర గంటలపాటు ప్రశ్నించారు. అనంతరం మే 26న మరోసారి నోటీసులు ఇచ్చారు. అయితే అప్పటికి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండటంతో ఆయన హాజరు కాలేకపోయారు. దాంతో విచారణకు విదేశీ పర్యటన తర్వాత హాజరవుతానని తెలియజేయగా.. ఇప్పుడు మూడోసారి విచారణకు పిలుస్తూ నోటీసులు జారీ చేశారు.

ఏసీబీ ప్రశ్నించనున్న కీలక అంశాలు..
- ఫార్ములా ఈ రేసుకు కేబినెట్ అనుమతి లేకుండానే నిధుల విడుదల
- సచివాలయ బిజినెస్ రూల్స్ ఉల్లంఘన
- ప్రభుత్వ నిధులను డైవర్ట్ చేసిన ఆరోపణలు
- పలు కంపెనీలతో నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాలు, అడ్వాన్స్ చెల్లింపులపై కూడా అడిగే అవకాశముందని సమాచారం.
ఇక ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులను ఏసీబీ విచారించింది. వారిలో మాజీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. అలాగే ఫార్ములా ఈ-ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించారు. కేటీఆర్ విచారణకు హాజరవుతుండటంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఏసీబీ కార్యాలయం వద్దకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కు కు సైతం నిబంధనలు విధించి.. ఏసీబీ కార్యాలయం పరిసరాల్లో సీసీ టీవీలతో పర్యవేక్షణను పెంచారు.
మరోవైపు కేటీఆర్ విచారణ అనంతరం ఏసీబీ ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అధికారులు సేకరించిన ఆధారాలు, ఫైళ్ల ఆధారంగా కేసును సమగ్రంగా సిద్ధం చేస్తున్నారు. ఈ విచారణతో దర్యాప్తు చివరి దశలోకి అడుగుపెట్టనుంది.












Click it and Unblock the Notifications