సిరిసిల్లా వాసులకు ఉరిశిక్ష: సుష్మాకు కెటిఆర్ లేఖ
హైదరాబాద్: దుబాయ్లో ఓ హత్య కేసులో మరణ శిక్ష పడిన కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు చెందిన ఆరుగురిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఐటి మంత్రి, సిరిసిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే కెటి రామారావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఇప్పటికే హతుడి భార్య క్షమాభిక్షకు ఒప్పుకున్నందున నిందితుల విడుదలకు చొరవ తీసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు కెటిఆర్ లేఖ రాశారు. నిందితులు జరిమానా కూడా చెల్లించిన విషయాన్ని లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. దుబాయ్లో ఓ హత్య కేసులో సిరిసిల్లాకు చెందిన ఆరుగురికి అక్కడి కోర్టు మరణ శిక్ష విధించింది.
కెసిఆర్తో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును కలిశారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అమలుకు బ్రిటన్ సహకరించాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ వారిని కోరారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలను బ్రిటన్ ప్రతినిధులు అభినందించారు. తెలంగాణ ప్రభుత్వానికి తమ సహకారం ఉంటుందని వారు తెలిపారు.
వచ్చే ఏడాది నుంచి విద్యారంగంలో సమూల మార్పులు చేస్తామని, ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్య ప్రారంభిస్తామని కెసిఆర్ ప్రతినిధులకు చెప్పారు. మాస్టర్ ట్రైనర్ల శిక్షణకు సహకరించాలని సిఎం కోరారు. సాలార్ జంగ్ మ్యూజియాన్ని బ్రిటిష్ మ్యూజియంగా తీర్చిదిద్దుతామని కెసిఆర్ ఈ సందర్భంగా తెలిపారు.