చంద్రబాబు ఓకే చెప్పారు!: ఉత్తమ్కు ఎల్ రమణ ఫోన్, ఆ విషయంలో 'ఏపీ సీఎం' చేతులెత్తేశారా?
హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ను, తెరాసను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ సహా కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.
ఈ మేరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ ఆదివారం మాట్లాడారు. కాంగ్రెస్ సహా అందరితో పొత్తు పెట్టుకోవాలన్న తమ సూచనకు పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆమోదం లభించిందన్నారు.
తెలంగాణపై చంద్రబాబు 'బిగ్' ప్లాన్: కాంగ్రెస్ గెలిస్తే అధికారంలోను భాగస్వామ్యం
అందరూ రావాలి, చంద్రబాబు ప్రచారం చేస్తారు
టీఆర్ఎస్, బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నీ ఏకతాటి పైకి రావాలని చెప్పారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు విషయంలో కొందరికి ఇబ్బంది కలిగినా సహకరించాలన్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో పట్టువిడుపులు ఉంటాయని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారని చెప్పారు. అవసరమైన చోట ప్రచారం చేస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తును తెలుగుదేశం పార్టీ నేతలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని ఎల్ రమణ అన్నారు. పొత్తులు, సీట్లపై తమకు స్వేచ్ఛ ఇచ్చారని చెప్పారు.
టీడీపీ ఎన్నికల కమిటీలు
తెలంగాణ తెలుగుదేశం ఎన్నికల కమిటీలు ఖరారయ్యాయి. ఎన్నికల సమన్వయ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీలను నియమించారు. ఎన్నికల సమన్వయ కమిటీలో ఎల్ రమణష దేవేందర్ గౌడ్, రావుల చంద్రశేఖర రెడ్డి, నామా నాగేశ్వర రావు, పెద్దిరెడ్డి, మేనిఫెస్టో కమిటీలో దేవేందర్ గౌడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీ నర్సింహులు, అలీ మస్కటి, శోభారాణి, ప్రచార కమిటీలో గరికపాటి, సండ్ర వెంకట వీరయ్య, కొత్తకోట దయాకర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, లక్ష్మణ్ నాయక్ తదితరులు ఉన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎల్ రమణ ఫోన్
పొత్తుల్లో భాగంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎల్ రమణ ఫోన్ చేశారు. కాంగ్రెస్తో పొత్తుకు సానుకూలంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. మరోవైపు, పొత్తులపై చర్చలకు సంప్రదింపుల కమిటీ రంగంలోకి దిగింది. సాయంత్రం సీపీఐ నేతలతో భేటీ కానున్నారు. సోమవారం ఉదయం టీజేఎస్ చీఫ్ కోదండరాంతోనూ చర్చించనున్నారు. సోమవారం సాయంత్రం ఉత్తమ్తో భేటీ అయ్యే అవకాశాలున్నాయి.
ప్రచారంపై చంద్రబాబు తేల్చేశారా?
చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఎల్ రమణ చెప్పారు. కానీ ఆయన ప్రచారం చేసే అవకాశాలు లేవని అంటున్నారు. పరోక్షంగా ఈ విషయం తెలంగాణ టీడీపీ నేతలకు చెప్పారని అంటున్నారు. తెలంగాణలో పార్టీ బాగుకోసం ఏం చేయాలో మీరే నిర్ణయించుకోవాలని, తెలంగాణ నేతలు సమష్టిగా పని చేయాలని చెప్పారు. ఎన్నికల్లో పోరాడాలని, అండగా ఉంటానన్నారు. కాంగ్రెస్తో వెళ్లాల్సి వచ్చినా నేతలే ప్రచారం చేసుకోవాలన్నారని తెలుస్తోంది. ప్రజల అభిప్రాయం ప్రకారం పార్టీ పని చేయాలని, ఏపీలో సీఎం హోదాలో ఉన్నాను కాబట్టి ఇక్కడికి రాలేనని చెప్పారని సమాచారం. కాంగ్రెస్తో పొత్తులపై తేల్చేందుకే చంద్రబాబు శనివారం వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ బాధ్యతలను ఆయన తెలంగాణ టీడీపీ నేతల పైనే వేసి, అమరావతి వెళ్లారు.